రాజకీయాలపై యువత ఆసక్తి కనబరచాలి
● డీసీసీ అధ్యక్షుడు అప్పలస్వామి కడ్రక
రాయగడ: ప్రస్తుత పరిస్థితిల్లో రాజకీయాలపై యువత ఆసక్తి కనబరచాలని డీసీసీ అధ్యక్షుడు, రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక అన్నారు. కళ్యాణసింగుపూర్ సమితి నారాయణపూర్లో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూడకుండా ఆసక్తి ఉన్న యువతీ, యువకులు రాజకీయాల్లో తమ సేవలను అందించాలని పిలుపునిచ్చారు. యువత దేశ భవిష్యత్ కాబట్టి వారు రాజకీయ రంగంలో రాణించగలిగితే స్వచ్ఛమైన పాలనను ప్రజలకు అందించే అవకాశం లభిస్తోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బిసంకటక్ ఎంఎల్ఏ నీలమాధవ హికక మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకుందని అన్నారు. యువతీ, యువకులు పార్టీ సిద్ధాంతాలు, నాయకులు చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీలొ చేరేందుకు ఆసక్తి కనబరుస్తుండటం హర్షనీయమని అన్నారు. అనంతరం సమితి పరిధిలోని ఏడు పంచాయతీలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పండ, సాధారణ కార్యదర్శి శంకర్షణ మంగరాజ్, చింతాలి నాగేష్ పాల్గొన్నారు.


