షరతులు అంగీకరిస్తే లొంగిపోతాం
రాయగడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ షరతులను అంగీకరిస్తే లొంగిపోయి, జన జీవన స్రవంతిలో కలిసిపోతామని మావోయిస్టు నేతలు బహిరంగ లేఖలో ప్రకటించారు. జిల్లాలోని కల్యాణ సింగుపూర్లో సోమవారం ఈ లేఖను కొంతమంది పత్రిక విలేకర్లకు పంపించారు. ఒడిశా రాష్ట్ర సీపీఐ (మావోయిస్టు) కమిటీ సభ్యులు నిఖిల్ అలియాస్ నిరంజన్ రౌత్, ఇందు అలియాస్ రస్మిత లెంక పేరిట విడుదలైన ఈ లేఖలో సాయుధ పోరాట మార్గాన్ని తాము విడిచిపెట్టి, ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేసేందుకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు. అయితే కొద్దికాలం క్రితం ప్రభుత్వానికి లొంగిపోయిన మావోయిస్టు నేతలు సవ్వసాచి పండ, ఆజాద్లను చాలా ఏళ్లుగా జైలులో ఉంచి ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభుత్వాలు విస్మరించాయని గుర్తు చేశారు. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తే తాము లొంగిపోయేందుకు ఏవిధంగా ఆలోచించమని లేఖలో ప్రస్తావించారు. అదేవిధంగా దళిత, పేద వర్గాలను అణిచి వేస్తున్న ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
మావోయిస్టు నేతల బహిరంగ లేఖ


