విరజా పీఠంలో రాష్ట్రపతి పూజాదులు
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా జాజ్పూర్ విరజా శక్తి పీఠం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజాదుల్లో పాల్గొన్నారు. ముక్తి మండపం వేద పండితుల ఆశీర్వచనం పొందారు. పూజాదుల్లో ఆద్యంతం సంప్రదాయ రీతిలో రాష్ట్రపతి పాలుపంచుకోవడం విశేషం. ఈ సందర్భంగా విరజా శక్తి పీఠం సుగంధిత పుష్పాలంకరణతో గుబాళించింది. ముందస్తుగా ప్రకటించిన వేళల ప్రకారం భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ఉదయం 9.30 గంటలకు జాజ్పూర్లోని పరిపాలనా భవనంలోని హెలిప్యాడ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగారు. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి ప్రతినిధిగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రవి నారాయణ్ నాయక్, సహకార చేనేత, జౌళి మరియు హస్తకళల మంత్రి ప్రదీప్ బాల సామంత్, జాజ్పూర్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రవీంద్ర నారాయణ్ బెహెరా, జాజ్పూర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా కౌన్సిల్ చైర్పర్సన్, డీఐజీ పోలీస్ చరణ్ సింగ్ మీనా, రైల్వే మరియు కోస్తా రక్షణ విభాగం పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ అరుణ్ బోత్రా, సెంట్రల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పూనమ్ తపస్ కుమార్, జిల్లా కలెక్టర్ అంబర్ కుమార్ కొరొ, సెక్యూరిటీ సూపరింటెండెంట్ ఎస్.ప్రతాప్ శ్రీమల్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
పూర్వీకులకు పిండ ప్రదానం
బిర్జా ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాభి గయలో పూర్వీకులకు పిండ ప్రదానం చేశారు. ఈ పూజా కార్యక్రమం దాదాపు గంట సేపు నిరవధికంగా కొనసాగింది. ఇందులో 4 మంది బ్రాహ్మణులు నిమగ్నమయ్యారు. అనంతరం ఆమె విరజా మాతను దర్శించుకున్నారు. ఆపై ప్రదక్షిణలు చేసి గంగేశ్వర్, ముక్తేశ్వర్, కాల భైరవుడు, 108 శివలింగాలు, పార్శ్వ దేవీ దర్శనం చేసుకుని ముక్తి మండప సభలో ఆశీస్సులు పొందారు. రాష్ట్రపతి ఆలయ సందర్శన సమయంలో పరిసరాలు వేద మంత్రాలు మరియు హలుహులి మంత్రోచ్ఛారణలతో మారుమోగాయి. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం రాష్ట్రపతికి బుద్ధ విగ్రహం మరియు ప్రసిద్ధ చేనేత తస్సా చీరను బహుమతిగా అందజేసింది. చివరగా ఆహ్వానించబడిన బ్రహ్మకుమారీలు రాష్ట్రపతిని కలిశారు. విరజా పీఠం పూజాదులు తదితర కార్యక్రమాలు పూర్తి కావడంతో ఉదయం 11.40 గంటలకు ప్రత్యేక విమానంలో బాలసోర్కు బయలుదేరారు.
విరజా పీఠంలో రాష్ట్రపతి పూజాదులు


