కోర్టులకు బాంబు బెదిరింపు
● బెంబేలెత్తిన యంత్రాంగం
భువనేశ్వర్: రాష్ట్రంలో కటక్, ఫుల్బణి, పూరీలోని జిల్లా జడ్జి కోర్టులకు బాంబు బెదిరింపు ఈమెయిల్లు అందడంతో రాష్ట్రంలో అనేక జిల్లా కోర్టులు శుక్రవారం భయాందోళనలకు గురయ్యాయి. బాంబు బెదిరింపుతో అనుబంధ యంత్రాంగం బెంబేలెత్తింది. బెదిరింపుల కారణంగా కోర్టులు వెంటనే ఖాళీ చేయించారు. తక్షణమే బాంబు నిర్వీర్య బృందాలు, స్నిఫర్ డాగ్లను మోహరించారు. కోర్టు ప్రాంగణంలో సమగ్ర భద్రతా తనిఖీలు చేశారు. కోర్టు సముదాయాల్లో బాంబులు అమర్చినట్లు అనామక ఈమెయిల్స్ పేర్కొన్నాయని సమాచారం. దీని వల్ల న్యాయ మూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, సందర్శకులలో తీవ్ర ఆందోళన నెలకొంది. భద్రతా కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో పోలీసులు కోర్టు భవనాలను ఖాళీ చేసి ప్రవేశాన్ని పరిమితం చేశారు. కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. పోలీసులు సత్వర చర్యలు చేపట్టారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ యూనిట్లు కోర్టు ప్రాంగణాల ప్రతి మూల విస్తృత తనిఖీలు నిర్వహించాయి. స్థానిక పోలీసు బృందాలు, క్రైమ్ బ్రాంచ్ నుండి సైబర్ సెల్ నిపుణులు ఈ విషయాన్ని చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులను గుర్తించడానికి బాంబు బెదిరింపు ఈ–మెయిల్ పంపినవారి ఐపీ చిరునామా, మూలాన్ని గుర్తించడంపై దర్యాప్తు వర్గాలు దృష్టి సారించాయి. బాంబు బెదిరింపు సమాచారం అందిన వెంటనే కోర్టు క్యాంపస్కు చేరుకుని కోర్టును ఖాళీ చేశారు. స్థానిక పోలీసులు, బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్లతో కోర్టు సముదాయంలో ప్రతి మూలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని వాహనాలను తనిఖీ చేశారు. క్యాంపస్ను శుభ్రపరిచారు.
కోర్టు కార్యకలాపాలు నిర్భయంగా నిర్వహించేందుకు సకాలంలో అన్ని చర్యలు చేపట్టారని పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రతీక్ సింగ్ తెలిపారు. సోదాలు నిర్వహించిన ప్రాంతాల్లో ఎలాంటి అభ్యంతరకరమైన పదార్థాలు లేదా పేలుడు పదార్థాలు కనుగొనలేదని ఆయన స్పష్టం చేశారు. గత నెలలో రాష్ట్రంలో కోర్టులకు ఇలాంటి బెదిరింపులు అలజడి రేపాయి. జనవరి నెలలో కటక్, సంబల్పూర్, దేవ్గఢ్, ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులు ప్రసారం చేసి రేపిన అలజడి ఇదే తరహాలో తుస్సుమనిపోయింది. వరుసగా రెండోసారి ఇటువంటి బూటకపు బెదిరింపు సందేశాల ప్రసారం పునరావృతం కావడంపట్ల సర్వత్రా భయాందోళనలు పెరుగుతున్నాయి.
కోర్టులకు బాంబు బెదిరింపు


