జాజ్పూర్ సందర్శించనున్న ద్రౌపది ముర్ము
● ముస్తాబు అవుతున్న విరజా క్షేత్రం
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరో 2 రోజుల్లో జాజ్పూర్ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన విరజా క్షేత్రం ఆమె సందర్శిస్తారు. విరజా మాతను దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ సముదాయంలో ఉన్న నాభి గయలో రాష్ట్రపతి పిత దేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి జాజ్పూర్ జిల్లా యంత్రాంగం రాత్రింబవళ్లు యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రపతి రాక నేపథ్యంలో జాజ్పూర్ నగరంలో దీర్ఘకాలంగా ఉపేక్షించిన ప్రధాన రహదారులను పునరుద్ధరిస్తున్నారు.
విరజా క్షేత్రం సందర్శించనున్న తొలి భారత రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము జాజ్పూర్ విరజా క్షేత్రం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకు ముందు మరే ఇతర రాష్ట్రపతి విరజా మాత దర్శనం లేదా ఇక్కడ పిండప్రదానం చేయడానికి రాలేదని స్థానిక అర్చక వర్గం సమాచారం. ఈ లెక్కన విరజా క్షేత్రం సందర్శించనున్న తొలి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కానున్నారు. భారత దేశంలోని తన బంధువులకు పిండ ప్రదానం చేసే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో జాజ్పూర్ విరజా క్షేత్రంలో నాభి గయ ప్రత్యేకమైనది.
సర్వ దర్శనం నిలిపివేత
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శన సమయంలో విరజా మాత సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపి వేస్తారని ప్రకటించారు. ఫిబ్రవరి 3న ఉదయం 5.30 గంటల నుంచి సర్వ దర్శనం నిలిపి వేస్తారు. రాష్ట్రపతి విరజా మాత పూజాదులు, నాభి గయలో పిండ ప్రదానం కోసం భద్రత దృష్ట్యా సర్వ దర్శనం మూసివేస్తారు. రాష్ట్రపతి ఆలయం నుండి తిరిగి వచ్చే వరకు ఈ ఆంక్షలు నిరవధికంగా కొనసాగుతాయని జాజ్పూర్ జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది.


