లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ‘లేబర్ కోడ్లు రద్దు చేసేవరకు పోరాడుదాం– ఫిబ్రవరి 12న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం‘ అనే పుస్తకాన్ని శనివారం శ్రీకాకుళం సీఐటీయూ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మికుల్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్ల వల్ల కార్మికుల కొనుగోలు శక్తి పడిపోయి, మార్కెట్లు మరింత కుదేలవుతాయన్నారు. అలా కాకుండా ఉండాలంటే కార్మికులు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పని బంద్ చేసి జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాలలో జరిగే ర్యాలీ, బహిరంగ సభలలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ కె.నాగమణి, జన విజ్ఞాన వేదిక జిల్లా వ్యవస్థాపక కార్యదర్శి కొత్తకోట అప్పారావు, ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఆదినారాయణమూర్తి, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డి.రమణారావు, ఉద్యోగ సంఘ నాయకులు శ్రీనివాస్ యాదవ్, సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, శ్రీకాకుళం పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.


