తండ్రిని హత్య చేసిన కుమారుడు
రాయగడ: కన్న కొడుకే తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తనమాట వినలేదని ఆగ్రహంతో గొంతుకోసి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 2వ తేదీన జిల్లాలో బిసంకటక్లోని బ్రాహ్మణ వీధిలో నివసిస్తున్న కై లాస్ చంద్ర సాహు అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతడి గొంతుకోసి హత్య చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన బిసంకటక్ పోలీసులు కొడుకే తండ్రిని హత్య చేసినట్లు గుర్తించి బుధవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కై లాస్ చంద్ర సాహు గత కొన్నాళ్లుగా వడ్డీ వ్యాపారం చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఆ వ్యాపారం తమకు అచ్చిరాదని అతని చిన్న కొడుకు శ్యామ సుందర్ సాహు వ్యతిరేకిస్తుండేవాడు. అయితే ఏదో వ్యాపారం చేయకపోతే జీవనోపాధి ఎలా కొనసాగించేదని కొడుకుని వారిస్తు వ్యాపారాన్ని కై లాస్ సాహు కొనసాగిస్తుండేవాడు. అయితే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు పెరగడంతో ఆరోజు ఇంట్లో తన తండ్రి ఒక్కడే ఉండడం గమనించిన కొడుకు శ్యామ్ సుందర్ తండ్రిపై దాడి చేశాడు. అంతేకాకుండా ఒక గ్లాసులో బాత్రూమ్లను పరిశుభ్రం చేసే యాసిడ్ను తేనెలో కలిపి తండ్రికి బలవంతంగా తాగించాడు.
అనంతరం తండ్రి గొంతును కత్తిపీట సాయంతో కోసి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని తండ్రి ఉంటున్న పై అంతస్తు గదిలోకి తరలించాడు. రక్తం మరకలు, హత్యకు వినియోగించిన కత్తిపీటను శుభ్రంగా కడిగిన తర్వాత ఎటువంటి ఆనవాలు లేవని నిర్దారణ చేసుకున్నాడు. అనంతరం సాయంత్రం ఇరుగుపొరుగు వారికి పిలిచి తన తండ్రిని ఎవరో హత్య చేశారని చెప్పాడు. తర్వాత పోలీసులకు సమాచారం అందించాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యకు కారకుడైన శ్యామ్ సుందర్ను అరెస్టు చేశారు.


