బీజేపీలోకి అశ్వినీ గొమాంగో
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో రాజకీయాలు కొత్త రంగులు మార్చుకుంటున్నాయి. అధికార బీజేపీ గుణుపూర్ శాసనసభ నియోజకవర్గంలో పట్టుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు గుణుపూర్లోని అగ్రనేతలు సైతం ఇదివరకే బీజేపీలో చేరారు. ఇదిలాఉండగా తాజాగా జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు బిజయ కుమార్ గొమాంగో కుమారుడు అశ్వినీ గొమాంగో బీజేపీలో చేరడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బిజయ్ గొమాంగో, ఆయన సతీమణి కేతకి గొమాంగోలు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి కుమారుడు బీజేపీలో చేరడంతో గుణుపూర్లో రాజకీయాలు ఈసారి రసవత్తరంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. శుక్రవారం రాజధాని భువనేశ్వర్లోని బీజేపీ కార్యాలయంలో అశ్వినీ గొమాంగో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, రాయగడ జిల్లా ఇన్చార్జి కొడూరు నారాయణరావుల సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. యువ నాయకుడిగా గుణుపూర్లో గుర్తింపు పొందిన అశ్విని చేరిక శుభ పరిణామమని జిల్లా అధ్యక్షుడు టి.గోపి ఆనంద్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
స్వర్గధామ్ సేవకులకు సన్మానం
రాయగడ: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి మహతి ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక సిరిగుడ సమీపంలోని స్వర్గధామ్లో సేవలు అందిస్తున్న తాల్ల లోకేశ్వరి, ఆమె సహచరుడు టి.లోకేష్ కుమార్లను శ్రీపతి చారిటబుల్ ట్రస్టు హెల్పింగ్ ఫర్ పూర్ అనే సంస్థ శుక్రవారం సన్మానించింది. సామాజిక సేవా రంగంలో వారు చేస్తున్న అమూల్యమైన కృషికి ఈ సన్మానం దక్కింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగో తరగతి ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తున్న లోకేశ్వరి మానవత్వానికి ప్రతీకగా ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆమె సొంత ఖర్చులతో సుమారు 100 మందికి పైగా అనాథ శవాలకు దహనం చేశారన్నారు. అదేవిధంగా ఆమె సహచరుడు టి.లోకేష్ కుమార్ చాలా కాలంగా ఈ మానవతా పనిలో సహకరిస్తూ తన వంతు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
బీజేపీలోకి అశ్వినీ గొమాంగో


