పట్టాలు తప్పిన చైన్నె–న్యూ జల్పాయ్గురి ఎక్స్ప్రెస్
భువనేశ్వర్: చైన్నె – న్యూ జల్పాయ్గురి ఎక్స్ప్రెస్ రైలు గురువారం ఉదయం 8.51 గంటలకు జఖపురా యార్డ్ గుండా వెళ్తున్నప్పుడు పట్టాలు తప్పింది. యార్డ్ పరిధిలో ఒక ఏసీ కోచ్, 2 సాధారణ శ్రేణి బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో రైలు చాలా నెమ్మదిగా కదులుతుండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రాణ హని, ప్రయాణికులకు గాయాలు ఇతరేతర అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తూర్పు కోస్తా రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. మరో వైపు ప్రయాణికుల రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు. ప్రభావిత ప్రయాణికులకు తగిన సదుపాయాలు కల్పించారు. దుర్ఘటనలో దెబ్బతిన్న బోగీలను తొలగించి ప్రయాణికుల సౌకర్యార్థం అవసరమైన మేరకు అదనపు బోగీలు జోడించారు. భువనేశ్వర్, ఖుర్దా రోడ్ నుంచి ప్రమాద సహాయక రైలు (ఏఆర్టీ), ఖుర్దా రోడ్ నుండి ప్రమాద సహాయక వైద్య పరికరాల బృందం (ఏఆర్ఎంఈ) ఘటనా స్థలానికి సకాలంలో చేరి అనుబంధ సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
రైల్వే ఉన్నతాధికారులు సంఘటన స్థలంలో పునరుద్ధరణ, భద్రత సంబంధిత కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సంఘటనా స్థలంలో హెల్ప్ లైన్ నంబర్ 8114382367 ఏర్పాటు చేశారు. పట్టాలు తప్పిన బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించడంతో రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరాయి. ఈ పనులు సమగ్రంగా మధ్యాహ్నం 2.45 గంటలతో పూర్తి కావడంతో రైళ్ల రాకపోకలు యథాతథంగా కొనసాగాయి.


