మహేంద్రగిరిపై శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు
పర్లాకిమిడి: మహేంద్రగిరి శిఖరానికి మహాశివరాత్రి పర్వదినం నాడు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు. అందుకు యాత్రికులకు అవసరమైన తాగునీరు, లైటింగ్, నడకదారిలో పోలీసుల భద్ర త, ఆహారం, వైద్య సదుపాయాలపై కలెక్టర్ అక్షయ సునీల్ అగార్వాల్ గురువారం కలెక్టరేట్లో అధికారులతో ముందస్తు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, ఎస్పీ జ్యోతీంద్ర కుమార్ పండా, జిల్లా ముఖ్య అటవీ శాఖ అధికారి కె.నాగరాజు, ఏడీఎం ఫల్గుణి మఝి, జిల్లా పరిషత్ అదనపు సీడీఓ పృథ్వీరాజ్ మండల్, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు హాజరయ్యారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు మహేంద్రగిరిపై మహాశివరాత్రి వేడుకలు, జాతర జరుగనున్న దృష్ట్యా భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని సౌకార్యాలు కల్పించాలని కలెక్టర్ అధికారులను కోరారు. రోడ్డు, భవనాల శాఖ రహదారులు మరమ్మతు చేయాలని కలెక్టర్ ఆర్అండ్బీ ఎస్ఈని ఆదేశించారు. యాత్రికులకు భద్రత కల్పించేందుకు పోలీసు బలగాలు మోహరించాలని, ప్రసాదం కేవలం రూ.10లకే భక్తులకు విక్రయించాలని అలాగే ఉచితంగా తాగునీరు, పార్కింగ్ స్థలం కేటాయించాలని ఆదేశించారు. మహేంద్రగిరిపై కుంతీ, యుధిస్టర మందిరాల వద్ద దర్శనం టిక్కెట్లు రూ.20లు వసూలు చేయాలని అటవీశాఖకు ఆదేశించారు. మహేంద్రంలో మద్యం, మత్తుపదార్థాలు పూర్తిగా నిషేధించాలని అధికారులను కోరారు. సమావేశంలో రాయగడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్, వైస్ చైర్మన్ జ్యోతి ప్రసాద్ పాణి, ఎస్డీపీఓ మాధవానంద నాయక్, అంతర్యామి గోమాంగో, రాయగడ తహసీల్దార్ సంతోష్ కుమార్ బారిక్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.


