పిప్పిలి సమీపంలో హిజ్రా దారుణ హత్య
భువనేశ్వర్: ఆదివారం రాత్రి భువనేశ్వర్ శివార్లు పిప్పిలి పోలీస్ ఠాణా పరిధిలోని సీఐఎఫ్ఏ సమీపంలో హిజ్రాను దారుణంగా హత్య చేశారు. మృత హిజ్రా సలేపూర్ నివాసి అంజలిగా గుర్తించారు. కొంత కాలంగా భువనేశ్వర్లో ఉంటుంది. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు అంజలిపై దాడి చేశారు. వారు ఆమెను కత్తితో పొడిచి ప్రాణాపాయ స్థితిలో ఇసుక కుప్ప దగ్గర కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దశలో విడిచి పెట్టి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన అంజలి స్పృహలోకి రావడంతో ఓపిక కూడగట్టుకుని తోటి స్నేహితులకు ఫోన్ చేయగలిగింది. ఈ సమాచారంతో ఘటనా స్థలం చేరిన అంజలి సహచరులు ఆమె తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. తక్షణమే ఆమెను క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు ఆమె మరణించినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. ఈ విషయం తెలియగానే పిప్పిలి ఠాణా పోలీసులు రంగంలోకి దిగి హత్య వెనుక గల ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన ప్రదేశంలో సైంటిఫిక్ బృందం, సెర్చ్ డాగ్ సహాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు బాధితురాలి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా కాల్ రికార్డు వివరాలను తనిఖీ చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు సీఐఎఫ్ఏ, సమీప ప్రాంతాల నుండి సీసీటీవీ ఫుటేజ్లను కూడా తనిఖీ చేస్తున్నారు.
హిజ్రాల ఆందోళన
నడి రోడ్డుపై బైఠాయించి హిజ్రా వర్గం ఆందోళన చేపట్టింది. స్థానిక సిఫా సమీపంలో జరిగిన హిజ్రా హత్యకు నిరసనగా వీరంతా రోడ్డును దిగ్బంధించారు. దీంతో ఎయిర్పోర్ట్ స్క్వేర్, ఏజీ స్క్వేర్, క్యాపిటల్ హాస్పిటల్ స్క్వేర్ వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హంతకుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ క్యాపిటల్ హాస్పిటల్ సమీపంలో రోడ్డుపై బైఠాయించారు. మృత హిజ్రా కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించి హత్య సంఘటనపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తును ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
పిప్పిలి సమీపంలో హిజ్రా దారుణ హత్య


