విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి
జయపురం: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోట్పాడ్ ఎమ్మెల్యే రూపుబొత్ర అన్నారు. శుక్రవారం జరిగిన కోట్పాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం దమయంతి సాహు వార్షిక నివేదికను చదివి వినిపించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలిపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కోట్పాడ్ ఎన్ఏసీ చైర్మన్ ఎం.శంకరరావు, ఎంపీ ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర మఝి, పాఠశాల యాజమాన్య కమిటి అధ్యక్షుడు సుధీర్ చంద్ర మహంతి, కోట్పాడ్ బ్లాక్ విద్యాధికారి సర్వేశ్వర నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
సెల్ టవర్లు నిర్మించాలి
కొరాపుట్: కొరాపుట్, రాయగడ జిల్లాలో వంద శాతం సిగ్నల్స్ వచ్చే విధంగా మొబైల్ టవర్లు నిర్మించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను గతంలో పార్లమెంట్లో వేసిన ప్రశ్నకి కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారన్నారు. కొరాపుట్ జిల్లాలో 459 టవర్లు నిర్మించాల్సి ఉండగా 386, రాయగడ జిల్లాలో 700 నిర్మించాల్సి ఉండగా 546 టవర్లు నిర్మించారన్నారు. మిగతా నిర్మాణం చేయకుండా సాకులు చెబుతున్నారన్నారు. ఈ సమస్య వలన వెనుకబడిన ఈ జిల్లాల్లో సెల్ సిగ్నల్స్ లేక గిరిజన్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బాలలకు విద్య, అత్యవసరం వైద్య సహాయం కోసం అంబులైన్స్కి ఫోన్ చేయలేక, ప్రభుత్వ పథకాల కోసం తెలియక గిరిజనులు బాధలు పడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తానని ఎంపీ సప్తగిరి ఉల్క ప్రకటించారు.
క్రీడలతో మానసిక ప్రశాంతత
రాయగడ: క్రీడలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని స్థానిక కస్తూరీ నగర్లోని మదర్ థెరిస్సా విద్యా సంస్థలకు చెందిన డైరక్టర్ బి.సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం విద్యా సంస్థల్లో వార్షిక క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి పిల్లలు క్రీడలపై ఆసక్తి కనబరిచేలా పోటీలను నిర్వహించాలన్నారు. ప్రస్తుత పరిస్థితిలో పోటీతత్వం పెరుగుతోందని, అందుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. క్రీడలతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రిన్సిపాల్ సూర్యనారాయణ హోత మాట్లాడుతూ రెండు రోజులు పాటు జరగనున్న క్రీడా పోటీల్లో వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
హార్డ్వేర్ షాపులో అగ్ని ప్రమాదం
రాయగడ: సదరు సమితి పరిధి కొమట్లపేట వద్ద పంచాయతీ కాంప్లెక్స్లో ఉన్న శ్రీరామ్ హార్డ్వేర్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.12 లక్షలు విలువ చేసే వస్తువులు, స్పేర్పార్ట్స్ దగ్ధమయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. షాపు నుంచి దట్టమైన పొగలు రావడంతో అటువైపుగా వెళ్లేవారు షాపు యజమానికి సమాచారం అందించారు. వెంటనే యజమాని మానస్ దళపతి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపు వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి


