అటవీ కార్యాలయంలో చోరీ
నరసన్నపేట: మండలంలోని తామరాపల్లిలో జాతీయ రహదారి పక్కన ఉన్న అటవీ రేంజర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. కార్యాలయ తాళాలు విరగొట్టి లోపలికి వెళ్లి బీరువాలో వస్తువులను చిందరవందర చేశారు. బీరువాల్లో ఉన్న కొంత నగదు పోయినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని పత్రాలు కనిపించడం లేదని అటవీ అధికారులు అంటున్నారు. సోమవారం ఉదయం ఆఫీస్కు వచ్చిన సిబ్బంది గమనించగా.. పై అధికారుల సూచనల మేరకు అటవీ శాఖ ఫారెస్టర్ శ్రీను నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ సభ్యులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. నరసన్నపేట ఏఎస్ఐ అసిరినాయుడు తదితరులు పరిశీలించారు. అలాగే మండలంలోని గోకయ్యవలసలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకుపోయారు. మైక్సెట్కు సంబంధించిన ఆంప్లిఫైర్ కనిపించడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఇక్కడ కూడా క్లూస్ టీమ్ వచ్చి వేలముద్రలు సేకరించింది.


