ఎమ్మెల్యేల జీతాలు తగ్గింపు
భువనేశ్వర్: రాష్ట్రంలో శాసన సభ సభ్యుల జీతభత్యాలు కుదించే అవకాశం ఉందని ఎమ్మెల్యే జీతాల కమిటీ చైర్మన్ భాస్కర్ మొఢై తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యేల జీతభతాల తగ్గింపు కోసం ముఖ్యమంత్రికి ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 9న శాసన సభలో ఎమ్మెల్యేల జీతభత్యాల పెంపు బిల్లు ఆమోదం పొందింది. ఎమ్మెల్యేల కనీస జీతం రూ. 3 లక్షల 45 వేలుగా ప్రకటించారు. ఒకేసారి ప్రజా ప్రతినిధుల జీతం 3 రెట్లు పెంచారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యేల జీతభత్యాల పెంపు పునఃపరిశీలించాలని ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. జీతాల సమస్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని విపక్ష బిజూ జనతా దళ్ తెలిపింది. జీతాల బిల్లు ఆమోదించబడింది కానీ తర్వాత ఆగిపోయింది. ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా ఈసారి ముందస్తుగా చర్చిస్తుందని బీజేడీ ఎమ్మెల్యే మనోహర్ రణధరి ఆశాభావం వ్యక్తం చేశారు. జీతాల పెంపు గురించి బిల్లు సభ ఆమోదించిన తర్వాత పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దాశరథి గొమాంగో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం బిల్లును మళ్లీ అసెంబ్లీకి ఎందుకు తీసుకువస్తుందని ఆయన ఎదురు తిరిగారు.
రాయగడ: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పారిశ్రామిక కేంద్రం జనరల్ మేనేజర్ చిత్తరంజన్ మల్లిక్ అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్వనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో అధ్యక్షతన జరిగిన వ్యవస్థాపక ప్రోత్సాహక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. యువత ఉద్యోగాల గురించి ఎదురుచూసి తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవడం కంటే, స్వయం ఉపాధి మార్గాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంపై యువత ఆసక్తి కనబర్చాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, యువ పారిశ్రామికవేత్తలు ఎ.గోవిందరావు, నరీన్ కుముంధాన్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేల జీతాలు తగ్గింపు


