అందరి సొమ్ములు ఒకేసారి చెల్లించాలి
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పోస్టాఫీస్లో జరిగిన సుమారు రూ.2.78 కోట్ల భారీ స్కామ్లో 33 మంది బాధిత ఖాతాదారులు తమందరికీ సొమ్ములను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత ఖాతాదారులంతా సోమవారం స్థానిక పోస్టాఫీస్ వద్ద బైఠాయించి పోస్టల్ సిబ్బందిని కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఇటీవల ఖాతాదారులంతా డిసెంబర్ 15వ తేదీన ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో సంక్రాంతి నాటికి అందరి సొమ్ములను చెల్లించడం జరుగుతుందని జిల్లా పోస్టల్ అధికారి హామీ ఇచ్చారు. అయితే సంక్రాంతి అయిపోయినా ఇప్పటివరకు డబ్బులు చెల్లించకపోవడంతో మరోసారి ఆందోళన చేపట్టారు. దీంతో స్థానిక పోస్టల్ సిబ్బంది బాధితుల్లో 20 మందికి చెక్లను సిద్ధం చేశారు. కాగా బాధిత ఖాతాదారులంతా అందరికి ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఖాతాదారులంతా స్థానిక పోలీస్ సిబ్బందిని ఆశ్రయించడంతో సీఐ మీసాల చిన్నంనాయుడు జిల్లా పోస్టల్ అధికారితో ఫోన్ ద్వారా సంప్రదించారు. పోస్టల్ డివిజనల్ అధికారితో బాధిత ఖాతాదారులందరితో మాట్లాడించి, వారి సమస్య పరిష్కరానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటల వరకు పోస్టల్ సిబ్బందిని కార్యాలయంలోకి విడిచిపెట్టకపోవడంతో పోస్టల్ సేవలు నిలిచిపోయాయి.


