సీఎం రేవంత్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రక్తం చల్లాలి అంటూ వ్యాఖ్యలు చేస్తారా?
మా ఓటమికి కారణం మా పొరపాట్లే.. సరిదిద్దుకుంటున్నాం..
ప్రజలకు ఇప్పుడు ఎవరేంటి అన్నది అర్థమవుతోంది..
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా..
సాక్షి, న్యూఢిల్లీ: ‘పంటలకు నీళ్లు అడిగితే రక్తం చల్లాలి’ అని సీఎం అంటారా? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ తన తుగ్లక్ నిర్ణయాల వల్ల రాష్ట్రం, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అసలు ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఏమాత్రం నియంత్రణ ఉందో లేదో అర్థం కావడం లేదని విమర్శలు సంధించారు. బుధవారం ఢిల్లీలోని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ‘చిట్చాట్’లో కేటీఆర్ మాట్లాడారు. ‘అధికారం చేపట్టిన 31 నెలల్లో దాదాపు 76 సార్లు ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ నుంచి కనీసం 76 పైసలు అయినా రాష్ట్రానికి తెచ్చారా, ఒక ప్రాజెక్టును తెచ్చారా, రైతులకు యూరియా తెచ్చారా?’ అని కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.
30 శాతం పర్సంటేజ్ మంత్రి పొంగులేటి
‘తెలంగాణలో కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి లాక్ అన్లాక్ గేమ్ ఆడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో నిషేధిత జాబితాలో 16లక్షల ఎకరాల భూమి ఉండేది. ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. భూముల వివాదాలను అన్లాక్ చేసేందుకు 30శాతం వసూలు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 30శాతం పర్సంటేజ్ మంత్రిగా మారారు. సర్వేల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్లు చూస్తోంటే ఆయనలో... ‘రాము, రెమో’లు ఇద్దరు ఉన్నట్లు కనిపిస్తోంది’ కేటీఆర్ పేర్కొన్నారు.
దక్షిణాది వాటా యథావిధిగా ఉంటేనే మద్దతు
దక్షిణాది రాష్ట్రాల నుంచి పార్లమెంట్లో 24శాతం ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని కొనసాగించాల్సిందేనని అని కేటీఆర్ అన్నారు. యధావిధిగా దక్షిణాది వాటా ఉంటేనే బిల్లుకు మద్దతిస్తామని చెప్పారు. తెలంగాణలో ఎలాగైనా సీట్లు పెరగడం ఖాయమని, అది డీలిమిటేషన్ విధానంలో అయినా, లేదంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారమైనా సీట్లు పెరగాల్సిందేనన్నారు. ఏదైనా సరే బీజేపీ అనుకుంటే అవుతుందని, లేదంటే ఆలస్యం తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు, ఓటములపై సీఎం రేవంత్ నాలుగు సర్వేలు చేయించుకున్నాడు. బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఈ నాలుగు సర్వేలు రిపోర్టు ఇవ్వడాన్ని రేవంత్ జీరి్ణంచుకోలేకపోతున్నాడని ధ్వజమెత్తారు.
మెట్రో భూములపై రేవంత్ కన్ను
‘మా ఓటమికి 100 శాతం కారణం మా పొరపాట్లే. అందుకే మేం ఓడిపోయాం. ఇప్పుడు అవన్నీ సరిదిద్దుకుంటున్నాం. మమ్మల్ని ఓడించారని ప్రజలను మేం ఎప్పుడూ తప్పుబట్టలేదు. మాకు రెండు పర్యాయాలు అవకాశం ఇచ్చారు, మూడోసారి మమ్మల్ని పక్కనపెట్టారు. ఎవరు ఏమిటి అనేది ఇప్పుడు ప్రజలకు అర్థం అవుతోంది. 18 కోట్ల చదరపు అడుగుల్లో ‘మెట్రో’కు సంబంధించి కమర్షియల్ కాంప్లెక్స్లను నిర్మించేందుకు మెట్రోలో భాగస్వాములైన కంపెనీలకు 2008లో అప్పటి సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 280 ఎకరాల భూమిని కేటాయించారు. లీజు పీరియడ్ 30–40 ఏళ్లు ఉంది. అయితే ఇప్పటి వరకు 1.4 కోట్ల చదరపు అడుగుల్లో కూడా నిర్మాణం జరగలేదు. ఆ 280 ఎకరాలపై రేవంత్ రెడ్డి కన్ను పడింది. రేవంత్, కేంద్ర మంత్రి బండి సంజయ్లతో వ్యక్తిగతంగా నాకు గట్టు పంచాయితీలు లేవు. కేవలం రాజకీయ విభేదాలే. 2027లో పాదయాత్ర చేస్తా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరయ్యా. సెలెట్రిటీల ఫోన్ ట్యాప్ కాలేదని పోలీసు అధికారులే చెబుతున్నారు. ఫార్ములా ఈ–కారు రేస్ కేసులో ఈ నెల 31న హాజరుకావాలని సమన్లు అందాయి. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు హాజరవుతా’ అని కేటీఆర్ అన్నారు.
బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ అయిన కేటీఆర్
ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించండి
కేంద్రమంత్రి కుమారస్వామికి కేటీఆర్ వినతి
సాక్షి, న్యూఢిల్లీ: ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని తక్షణమే పునఃప్రారంభించి, భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇంచార్జ్ జాన్సన్ నాయక్, సీసీఐ సాధన కమిటీతో కలసి బుధవారం ఢిల్లీలో ఆయన కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. సీసీఐ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఉండి, పునరుద్ధరణ జరిగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీసీఐ పునరుద్ధరణకు హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాంట్లోని రూ.50 కోట్ల విలువైన యంత్రాలను ఈ–వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ కొనసాగిస్తోందని, ఇది ఆందోళనకరమని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.


