మరో కాన్పుకూ మంజూరు చేయాల్సిందే..
దాన్ని ఒకే ప్రసవంగానే చూడాలి
హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఒకేసారి కవలలు జన్మించి న సందర్భాన్ని రెండు వేర్వేరు ప్రసవాలుగా పరిగణించరాదని, అది ఒకే ప్రసవంగా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది. ‘టూ చైల్డ్ నార్మ్’పేరుతో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు నిరాకరించడం సరికాదని, అది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. తొలిసారి ఇద్దరు పిల్లలు పుట్టినా రెండో కాన్పునకు కూడా 6నెలల ప్రసూతి సెలవు మంజూ రు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుత కేసులో పిల్లలు ఒకరు పుట్టారా.. లేదా కవల లు జన్మించారా.. అన్నది మహిళ చేతిలో లేదని, ఇది జీవసంబంధమైన ప్రక్రియని వ్యా ఖ్యానించింది.
మొదటి కాన్పులో కవలలకు జన్మనిచ్చినందున రెండవ కాన్పునకు మహిళా ఉద్యోగి ప్రసూతి సెలవుకు అర్హురాలేనని చెప్పింది. పిటిషనర్కు ఆ మేరకు సెలవు మంజూరు చేయాలని, ఈ కాలానికి సంబంధించి పూర్తి వేతనం చెల్లించాలని గురుకుల సొసైటీని ఆదేశిస్తూ స్పష్టమైన తీర్పునిచ్చింది. రెండు కాన్పునకు ప్రసూతి సెలవును నిరాకరించడా న్ని సవాల్ చేస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్న స్వరూపారాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ కాజా శరత్ విచారణ చేపట్టారు.
జీవో 50.. మార్గదర్శకాలకు విరుద్ధం
పిటిషనర్ తరఫు న్యాయవాది గట్టు వినయ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్ తొలి గర్భధారణలో కవలలు జన్మించారు. అనంతరం రెండోసారి గర్భవతి కావడంతో 180 రోజుల ప్రసూతి సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే తొలి కాన్పులోనే ఇద్దరు పిల్లలు పుట్టారని, ఆమెకు ఇప్పటికే ఇద్దరు సంతానం ఉన్నట్లేనంటూ అధికారులు ప్రసూతి సెలవును తిరస్కరించారు. కవలల జననం ఒకే గర్భధారణ ఫలితం. దానిని రెండు ప్రసవాలుగా పరిగణించడం చట్టవిరుద్ధం’అని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2014లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 50 జారీ చేసిందని, ఈ నిబంధనల ప్రకారం ప్రసూతి సెలవు ఇద్దరు జీవించి ఉన్న పిల్లలకు వర్తిస్తుందన్నారు.
పిటిషనర్కు ఇద్దరు పిల్లలున్నందున సెలవు నిరాకరించారని, జీవోకు విరుద్ధంగా సెలవు మంజూరు చేస్తే ఆడిట్ అభ్యంతరాలు, నిధుల దుర్వినియోగం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రసూతి సెలవులను సంక్షేమ దృక్పథంతో మహిళల హక్కులను పరిరక్షించేలా చూడాలని.. యాంత్రికంగా అమలు చేయరాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీం, హైకోర్టుల మార్గదర్శకాలకు విరుద్ధంగా జీవో 50 ఉందన్నారు.


