సాగు ఎలా చేద్దా'మనీ' | Farmers worries about insufficient cash reserves in banks | Sakshi
Sakshi News home page

సాగు ఎలా చేద్దా'మనీ'

Jul 16 2026 4:49 AM | Updated on Jul 16 2026 4:49 AM

Farmers worries about insufficient cash reserves in banks

బ్యాంకుల్లో సరిపడా నగదు నిల్వలు లేక రైతన్నల తిప్పలు 

అనేక ప్రాంతాల్లో ఏటీఎంల వద్ద ‘అవుట్‌ ఆఫ్‌ సర్వీస్‌’బోర్డులు 

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల:  కరెన్సీ నోట్లకు కరువొచ్చింది. బ్యాంకుల్లో సరిపడా నగదు లేక ఖాతాదారులు తిప్పలు పడాల్సి వస్తోంది. మరోవైపు జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాల్లో చాలాచోట్ల ఏటీఎంల్లో ‘అవుట్‌ ఆఫ్‌ సర్వీస్‌’బోర్డులు కనిపిస్తున్నాయి. కొన్ని ఏటీఎంలు ‘నో క్యాష్‌’అని చూపిస్తున్నాయి. రైతుభరోసా, ధాన్యం చెల్లింపులు, పంట రుణాలు, తదితరాల సంబంధిత డబ్బులన్నీ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. కానీ ఆ నగదును తీసుకునేందుకు రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. డిజిటల్‌ చెల్లింపు చేయలేని వారందరికీ క్యాష్‌ తప్పనిసరి అయ్యింది. 

వ్యవసాయ  సీజన్‌లో కూలీలకు చెల్లింపులు, యంత్రాలు, పనిముట్ల కొనుగోళ్లు, మరమ్మతులు, ఎరువులు, విత్తనాలు తదితర అవసరాలకు డబ్బు అవసరమవుతోంది. కాగా శుభ, ఇతర కార్యక్రమాలకు సైతం చేతిలో నగదు ఉండటం లేదని రైతులు అంటున్నారు. ఇక గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ నగదుతోనే ఎక్కువ లావాదేవీలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 1,285 ఏటీఎంలు ఉండగా, వీటిలో 350పైగా పని చేయడం లేదు. మెదక్, సిద్దిపేట, ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో నగదు కొరతతో రూ.10 వేల చొప్పున డ్రా చేసుకోవాలని ఆంక్షలు ఉండటం గమనార్హం.

క్యాష్‌ ఎందుకు తగ్గుతోంది? 
గతంలో కంటే ప్రస్తుతం బ్యాంకులకు ఆర్‌బీఐ నుంచి నగదు సరఫరా తగ్గినట్లు అధికారులే చెబుతున్నారు. ఏటీఎంల్లో చోరీలు పెరగడంతో భద్రత దృష్ట్యా చాలా బ్రాంచీల్లో నిల్వలు తగ్గించేశారు. ఉదాహరణకు మంచిర్యాల జిల్లాకు చెస్ట్‌ బ్యాంకులు (నగదు సరఫరా చేసేవి) రెండు ఉండగా ప్రస్తుతం ఒక్కటి మాత్రమే ఉంది. ఇక్కడి నుంచే ఆసిఫాబాద్‌ జిల్లాకు కూడా నగ దు సరఫరా జరుగుతోంది. రాష్ట్రంలో చాలాచోట్ల బ్యాంకుల్లో రోజువారీగా కనీసం రూ.5 లక్షల లోపే నగదు అందుబాటులో ఉంటోంది. దీంతో ఎవరైనా రూ.లక్ష పైన నగదు కావాలంటే ముందస్తుగా సమాచారం ఇస్తేనే నగదు ఉపసంహరణకు వీలవుతోంది. 

ఇక డిజిటల్‌ లావాదేవీల నేపథ్యంలో ఏటీఎంలకు ఖాతాదారులు తగ్గడంతో క్రమంగా నగదు నిల్వలు తగ్గించేస్తున్నారు. ఎప్పుడైనా అవస రమై వెళ్తే నగదు దొరకడం లేదు. రూ.100 నోటు నుంచి రూ.200, రూ.500 నోట్ల కొరత తీవ్రంగా ఉంటోంది. ఈ క్యాష్‌ కొరతను ఆసరా చేసుకుని ప్రైవేటు వ్యక్తులు చార్జీలు వసూలు చేసి నగదు ఇస్తున్నారు. అయితే వ్యవసాయ సీజన్‌లో అందరూ నగదు కోసం రావడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గతంలో కంటే ఆర్‌బీఐ నుంచి క్యాష్‌ సరఫరా కూడా తగ్గిందని అంటున్నారు.

ఈ రైతు పేరు ఎడవెల్లి కనకయ్య. యాదాద్రి జిల్లా తుర్కపల్లికి చెందిన ఈయనకు అత్యవసరంగా రూ.2 లక్షల నగదు అవసరం కావడంతో స్థానిక ఎస్‌బీఐ వెళ్లాడు. బ్యాంకులో నగదు లేదని, రూ.50 వేల చొప్పున విడతల వారీగా తీసుకోవాలని అధికారులు సూచించారు. సాగు పనులకు నగదు అవసరం తప్పనిసరి కావడంతో గత 4 రోజులుగా బ్యాంకు చుట్టే తిరగాల్సి వస్తోందని వాపోయాడు.

పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు 
డిజిటల్‌ చెల్లింపులు వేగంగా సాగుతున్న తరుణంలోనూ రియల్‌ ఎస్టేట్‌లో భూములు, ఇళ్ల క్రయవిక్రయాలకు సంబంధించిన నగదు మార్పిడి రూ.లక్షల నుంచి కోట్ల వరకు క్యాష్‌ రూపంలోనే జరుగుతోంది. ఇక బంగారం, ఇతరత్రా భారీ స్థాయి కొనుగోళ్లలో వ్యాపారులకు, పెద్ద షాపుల్లో జీఎస్టీ పడకుండా, చాలామంది నగదుతోనే లావాదేవీలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌లో కాకుండా క్యాష్‌ కావాలంటున్నాయి. ఇప్పటికీ కొన్ని వ్యాపార వర్గాలు పెద్దమొత్తంలో నగదుతోనే కార్యకలాపాలు చేస్తున్నాయి.

ఏటీఎం, బ్యాంకులోనూ నగదు లేదు 
ఏటీఎంలో డబ్బులేక పోతే బ్యాంకుకు వెళ్లా. అక్కడ కూడా అధికారులు క్యాష్‌ లేదని చెప్పడంతో వెనక్కి వెళ్లిపోతున్నా.  – బోయిని సోమేశ్వర్, గుండాల మండలం, మరిపడిగ, యాద్రాద్రి జిల్లా

రోజుకు రూ.20 వేలు ఇస్తున్నారు 
వారం నుంచి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. వ్యవసాయ పనుల కోసం రూ.లక్ష అవసరం ఉండగా నాగర్‌కర్నూల్‌లోని యూనియన్‌ బ్యాంకుకు వస్తే రూ.20 వేలే ఇస్తున్నారు. రోజూ పనులు వదిలిపెట్టి తిరగాలంటే ఇబ్బందే. బ్యాంకులతో పాటు ఏటీఎంల్లోనూ డబ్బులు లేవు.    – కనుకు వెంకటయ్య,  యాదిరెడ్డిపల్లి, తాడూరు మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement