ప్రేమకు సహకరించాడని మేనమామ దారుణ హత్య | Assassination incident creates chaos in Asifabad district of Kumurambheem | Sakshi
Sakshi News home page

ప్రేమకు సహకరించాడని మేనమామ దారుణ హత్య

Jul 16 2026 4:18 AM | Updated on Jul 16 2026 4:18 AM

Assassination incident creates chaos in Asifabad district of Kumurambheem

రెబ్బెన: సమీప బంధువులైన యువతి, యువకుడి మధ్య ప్రేమకు సహకరించాడనే కోపంతో పథకం ప్రకారం మేనమామను ఇద్దరు మేనల్లుళ్లు దారుణంగా హత్య చేసిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కలకలం రేపింది. రెబ్బెన మండలం నారాయణపూర్‌కు చెందిన వేమునూరి స్వామి (48) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగజ్‌నగర్‌ మండలం గెర్రగూడకు చెందిన అన్నదమ్ములు ఇరిగిరాల తిరుపతి, వెంకటేశ్‌లకు వేమునూరి స్వామి మేనమామ అవుతాడు. 

తిరుపతి, వెంకటేశ్‌ల మేనకోడలుతో స్వామి అన్న కొడుకు మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. దీనికి స్వామినే కారణమనే అనుమానంతో వారు కక్ష పెంచుకున్నారు. పథకం ప్రకారం మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తిరుపతి, వెంకటేశ్‌ బైక్‌పై నారాయణపూర్‌లోని స్వామి ఇంటికి వచ్చారు. మాట్లాడుకుందామని పిలిచి ఇంట్లో నుంచి అతడిని తీసుకెళ్లారు. 

ఎస్సీ కాలనీ గ్రామ శివారు వరకు తీసుకెళ్లి వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో విచక్షణారహితంగా పొడిచి తల నరికి పారిపోయారు. బుధవారం ఉదయం ఆసిఫాబాద్‌ డీఎస్పీ అశోక్, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశామని, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

కన్నకొడుకునే కడతేర్చింది.. 
డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఓ తల్లి ఘాతుకం
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన   
సూర్యాపేటటౌన్‌: ఓ తల్లి కన్న కొడుకును చంపిన ఘటన జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట పట్టణంలోని సుందరయ్యనగర్‌ కాలనీకి చెందిన భూక్య అచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమె భర్త 20 ఏళ్ల క్రితం మృతి చెందాడు. అచ్చికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు కాగా కుమారుడు విజయ్‌ (30)కు ఇంకా పెళ్లి కాలేదు. ఏ పని చేయకుండా, మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజూ తల్లితో గొడవపడుతూ డబ్బుల కోసం తీవ్రంగా వేధించేవాడు. 

ఈ నెల 12వ తేదీ రాత్రి కూడా విజయ్‌ తాగొచ్చి తల్లిని తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. రోజూ పడుతున్న నరకాన్ని భరించలేకపోయిన అచ్చి.. తీవ్ర కోపోద్రేకానికిగురై ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకొని నిద్రిస్తున్న కొడుకు తలపై బలంగా బాదింది. దీంతో విజయ్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుమారుడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపినట్టు నమ్మించింది. చికిత్స పొందుతూ ఈ నెల 13న విజయ్‌ మృతి చెందాడు. పట్టణ పోలీసులు మొదట గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్టు కేసు నమోదు చేయగా.. విచారణలో తానే చంపినట్టుగా అచ్చి ఒప్పుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement