పీఎంజే చోరీ కేసును కేస్స్టడీగా చెప్పాలని హోంశాఖ నిర్ణయం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసు దర్యాప్తులో కొత్త విషయం వెలుగుచూసింది. ఈ ఏడాది మే 3న జరిగిన దోపిడీలో సుబోధ్ సింగ్ ముఠా రూ.88లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఆభరణాలను ధర్మపురి మీదుగా ఛత్తీస్ఘడ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని అసాన్సోల్ నగల వ్యాపారికి విక్రయించినట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి ఆరాతీయగా బంగారాన్ని బిహార్ సరిహద్దుల మీదుగా నేపాల్ తరలించారని తెలుసుకున్నారు.
కాగా, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి చేసిన దోపిడీని ఛేదించిన సందర్భాన్ని డిపార్ట్మెంట్లో చేరనున్న ప్రతీ పోలీస్ తెలుసుకోవాలని హోంశాఖ నిర్ణయించింది. ఇటీవల ఎంపికైన డీఎస్పీలకు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో ఈనెల 18న కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పాఠంగా బోధించనున్నారు.
ఘటనకు ముందు రెక్కీ, దోపిడీ చేసిన విధానం, ఆధారాలు లేకుండా పరారైన వైనం, ఒక్కొక్క పనికి ఒక్కో వరుసలో నేరస్తులను ఉపయోగించిన తీరు, ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా దొంగలు సంప్రదింపులు జరిపిన విధానం, బిహార్ జైలులో ఉండి ఈ మొత్తం దోపిడీకి స్కెచ్ వేసిన సుబోధ్సింగ్ను కరీంనగర్కు తరలించే వరకు జరిగిన ఘటనలను ఫొటోలు, వీడియోల రూపంలో గౌస్ ఆలం స్వయంగా వివరించనున్నారు. ఇకపై డిపార్ట్మెంట్లోకి కొత్తగా వచ్చే కానిస్టేబుల్ దగ్గర నుంచి డీఎస్పీల వరకు పీఎంజే దోపిడీ కేసును కేస్ స్టడీస్గా బోధించాలని పోలీస్శాఖ నిర్ణయించనుంది.


