‘చాత్రోంకి గూంజ్’ కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్
కంటోన్మెంట్: కేంద్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను వ్యాపారంగా మార్చిందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. ‘చాత్రోంకి గూంజ్’పేరిట బుధవారం బోయినపల్లి మల్లారెడ్డి గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగ, విద్యా, పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో కేంద్ర ప్రభుత్వం.. లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ సహా పలు జాతీయ స్థాయి పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీలు దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసాన్ని దెబ్బతీశాయని అన్నారు.
ఇన్ని ఆరోపణలు, ఆధారాలు వెలుగులోకి వచ్చినప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఆయనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరింత బాధాకరమని అన్నారు. విద్యార్థుల హక్కులను కాపాడేందుకు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ దేశవ్యాప్తంగా ‘చాత్రోంకి గూంజ్’కార్యక్రమాన్నిచేపట్టారని తెలిపారు.
ఈ ఉద్యమంలో ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం కలిగిన వ్యవస్థను కేంద్రం అమలు చేయాలన్నారు. ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ కన్వినర్గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేశ్ విద్యార్థులు పాల్గొన్నారు.
నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. ఈ దఫాలో 50కి పైగా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తామని, ఆయా కార్పొరేషన్లకు డైరెక్టర్ పదవులను కూడా త్వరలోనే నింపుతామని ఆయన వెల్లడించారు. ఆయన బు«ధవారం గాం«దీభవన్లో విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. నలుగురైదుగురు మినహా రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షుల పనితీరు బాగుందని చెప్పారు. మండల కమిటీల నియామకంలో డీసీసీల నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. డీసీసీలతో సమావేశాలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. సీపీఐ తమ మిత్రపక్షంగా ఉందని, ఆ పార్టీతో మైత్రి కొనసాగుతుందని కూడా మహేశ్గౌడ్ వెల్లడించారు.


