ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, కుటుంబ సంబంధాల సలహాదారు, వ్యక్తిత్వ వికాసంపై ఎన్నో పాపులర్ రచనలు చేసిన రచయిత డాక్టర్ బి.వి. పట్టాభిరామ్ జ్ఞాపకార్థం, ఎమెస్కో బుక్స్ సంస్థ ఓ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. ‘ఛేంజ్ మేకర్’ అనే విశిష్ట పురస్కారాన్ని నెలకొల్పింది. దేశానికి వెన్నెముకగా నిలిచే బలమైన శక్తిగా ఎదిగేలా వివిధ రంగాల్లో నవ యువతరాన్ని ప్రేరేపించేందుకు అవిశ్రాంత కృషి చేస్తున్న సమాజ మార్గదర్శకులకు ఈ పురస్కారాన్ని ఏటా ప్రదానం చేస్తారు.
లక్షలాది యువకులు, విద్యావేత్తలను ప్రేరేపించి, వారిని దేశం గర్వించేలా తీర్చిదిద్దడంలో బి.వి. పట్టాభిరామ్ (1950-2025) జీవితకాల కృషి చేసిన సంగతి తెలిసిందే. ఆ కృషిని గుర్తు చేసుకుంటూ, అలాంటి వ్యక్తులను ఏటా గౌరవించడమే ఈ పురస్కారం ముఖ్యోద్దేశం. ప్రముఖ సంపాదకులు కే.రామచంద్రమూర్తి అధ్యక్షతన ఏర్పాటైన ఎంపిక కమిటీ, పలువురు నిపుణులతో సంప్రదించి తొలి ‘ఎమెస్కో – డాక్టర్ బి.వి. పట్టాభిరామ్’ అవార్డు ‘ఛేంజ్ మేకర్-2026’ను ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ రెడ్డికి అందించాలని నిర్ణయించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మారుమూల గ్రామంలో సతీష్ రెడ్డి జన్మించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన సతీష్ రెడ్డి, 1986లో ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్’ (డి.ఆర్.డి.ఓ) సర్వీసుల్లో చేరారు. దేశ రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా, డి.ఆర్.డి.ఓ చైర్మన్గా డాక్టర్ సతీష్ రెడ్డి రక్షణ రంగంలో ఎన్నో వినూత్న మార్పులు తెచ్చారు. క్షిపణులు, వాటికి సంబంధించిన అంశాల పరిశోధనలలో ఆయన కీలక పాత్ర పోషించారు.
రక్షణ రంగ దిగుమతులను తగ్గించి, ఎగుమతులను పెంచడం ద్వారా భారతదేశం స్వయంసమృద్ధి సాధించేలా చేశారు. కేవలం శాస్త్రవేత్తగానే కాకుండా, 2019-22 మధ్య కాలంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో బాధితుల కోసం ఆయన చేసిన సేవలు ఆయనలోని మానవత్వాన్ని చాటాయి. వీటన్నిటి కన్నా మిన్నగా ఆయన తన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, ఇంటర్వ్యూల ద్వారా వేలాది మంది యువతీ యువకులను బాధ్యతాయుతమైన భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.
ఈ నేపథ్యంలో, ఆయనకు ‘ఎమెస్కో - డాక్టర్ బి.వి. పట్టాభిరామ్’ (ఛేంజ్ మేకర్-2026) అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ జూలై 26వ తేదీ, ఆదివారం, ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో ఈ పురస్కార ప్రదానోత్సవం జరగనుంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నరసింహ, జయా పట్టాభిరామ్ సమక్షంలో... ‘పద్మవిభూషణ్’ గ్రహీత, మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి చేతుల మీదుగా డాక్టర్ సతీష్ రెడ్డి ఈ విశిష్ట పురస్కారాన్ని అందుకోనున్నారు.


