‘ఎగిరే రాడార్‌’కు లైన్‌ క్లియర్‌ | Set India indigenous Netra Airborne Early Warning and Control System | Sakshi
Sakshi News home page

‘ఎగిరే రాడార్‌’కు లైన్‌ క్లియర్‌

Jun 26 2026 4:53 AM | Updated on Jun 26 2026 5:11 AM

Set India indigenous Netra Airborne Early Warning and Control System

నేత్ర ఎయిర్‌బోర్న్‌ ఎర్లీ వార్నీంగ్, కంట్రోల్‌ సిస్టమ్‌ వినియోగానికి కేంద్రం పచ్చజెండా 

బెంగళూరు: శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, విమానాలను ఓ కంట కనిపెడుతూ భూతలం మీది భారత బలగాలకు సమాచారం చేరవేసి అప్రమత్తంచేసే ‘ఆకాశ రాడార్‌’గా రికార్డ్‌ నెలకొల్పనున్న భారత తొలి స్వదేశీ ఎయిర్‌బోర్న్‌ ఎర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ‘నేత్ర’భారత వాయుసేన చేతికొచ్చింది. ఇకపై ఈ వ్యవస్థతో అత్యంత ఎత్తుల్తో ప్రయాణించే విమానాన్ని రణక్షేత్రంలో వినియోగించుకునేందుకు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ తుది అనుమతి మంజూరుచేసింది. 

సంబంధిత ఫైనల్‌ ఆపరేషన్‌ క్లియరెన్స్‌(ఎఫ్‌ఓసీ) సర్టిఫికేట్‌ను భారత వాయుసేనకు గురువారం డీఆర్‌డీవో అందజేసింది. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎయిర్‌ స్టాఫ్‌ డెప్యూటీ చీఫ్, ఎయిర్‌ మార్షల్‌ అవధీశ్‌ కుమార్‌ భారతి పాల్గొని ప్రసంగించారు. ‘‘ఏఈడబ్ల్యూసీకి తుది అనుమతి రావడం ఎంతో గర్వంగా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే కాదు గగనతల రక్షణంలో భారత వాయుసేన సాధించబోయే స్వావలంభన, ఆత్మనిర్భరతకు ఇది మరో ముందడుగు. 

ఎర్లీ వార్నీంగ్‌ వ్యవస్థ ప్రస్థానం అసాధారణం. ఎన్నో సవాళ్లను అధిగమించి ఇక్కడి దాకా వచ్చాం. ఇంకా ఎన్నో ఆవిష్కరణలు చేయాల్సి ఉంది. భారత వాయుసేన, డీఆర్‌డీఓ, సెంటర్‌ ఫర్‌ ఎయిర్‌బోర్న్‌ సిస్టిమ్స్‌ తదితర విభాగాల శాస్త్రవేత్తల సమష్టి కృషికి సంబరం చేసుకోవాల్సిన రోజు ఇది’’అని ఆయన అన్నారు. 

ఏఈడబ్ల్యూసీ అనేది విమానంలో ఉండే పలు రకాల సెన్సార్ల సమాహారం. ఇందులో రాడార్, ఎల్రక్టానిక్‌ యుద్ధతంత్ర వ్యవస్థలు, అత్యంత భద్రమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ఉంటాయి. ఈ విమానాన్ని శత్రువులు గుర్తిస్తే శత్రు దాడుల నుంచి తనను తాను కాపాడుకునే రక్షణ వ్యవస్థలూ ఈ విమానంలో ఉంటాయి. భవిష్యత్తులో నేత్రా వ్యవస్థను ఆరు విమానాల్లో అమర్చనున్నారు.   
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement