తమిళనాడు సీఎం విజయ్పై ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నిర్వహించే అన్ని అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్ర గీతమైన తమిళ్ తాయ్ వాల్తుకు తొలి ప్రాధాన్యతను ఇచ్చి ఆలపించాలని అసెంబ్లీ వేదికగా చేసిన తీర్మానాన్ని కమల్ హాసన్ స్వాగతించారు. ప్రభుత్వం నిర్ణయం అభినందనీయం అని.. రాష్ట్ర హక్కులు, సాంస్కృతిక గుర్తింపుపై గట్టిగా నిలబడే ధోరణిని కొనసాగించాలని ఆయన ట్వీట్ చేశారు.
సీఎం విజయ్ తీసుకొచ్చిన ఈ తీర్మానాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ సీఎం విజయ్ అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడారు. సీఎం విజయ్ ప్రసంగిస్తూ భాష అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ మాత్రమే కాదని, ప్రపంచంలో ఏ భాషకైనా అది వర్తిస్తుందన్నారు. అయితే, తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదని, అది మన ప్రాణం, మన భావోద్వేగం. అమ్మ అని పిలిచినప్పుడు ఏ బంధం, ప్రేమ మనలో ఉప్పొంగుతుందో, మన మాతృభాష అయిన తమిళం కూడా అంతే పవిత్రమైనదని వ్యాఖ్యలు చేశారు.
1891లో మనోన్మణియం సుందరనార్ రాసిన గీతాన్ని ప్రస్తావిస్తూ భారత ఉపఖండం అనే అందమైన ముఖానికి నొసటిపై రూపకమైన తిలకం వంటిది తమిళనాడు అని, దాని పరిమళం ప్రపంచమంతా వ్యాపించాలని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో తమిళులు లేని దేశమంటూ లేదని, తమిళం అంటే కేవలం ఒక భాష కాదని, అదొక సంస్కృతి, ఆలోచన , ఆతిథ్యానికి ప్రతీక అని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే తమిళం అంటే గెత్తు (స్టైల్ లేదా గెలుపు), తమిళం అంటే పవర్‘ అని సీఎం స్పష్టం చేశారు. అనంతరం ఈ ప్రత్యేక తీర్మానానికి అసెంబ్లీలోని డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, పిఎంకే, వీసీకే సహా అన్ని రాజకీయ పక్షాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి.
அரசு நிகழ்ச்சிகளில் தமிழ்த்தாய் வாழ்த்து முதலாவதாகப் பாடப்பட வேண்டும் என சட்டமன்றத்தில் தீர்மானம் நிறைவேற்றியிருப்பது மகிழ்ச்சிக்குரியது; வரவேற்கத்தக்கது. மாநில உரிமைகளை விட்டுத்தராத இந்தப் போக்கு தொடரவேண்டும்.
— Kamal Haasan (@ikamalhaasan) August 11, 2026


