సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మిల్లో భాగంగా విద్యార్థులకు వారానికి ఓకసారి చికెన్ బిర్యానీ పెట్టేందుకు దాదాపు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఒక వేళ ఈ పథకం అమలైతే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చికెన్ బిర్యాణీ పెట్టిన రాష్ట్రంగా తమిళనాడు రికార్డు సృష్టించనుంది.
మధ్యాహ్న భోజన పథకంలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీని చేర్చాలనే ప్రతిపాదన వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల్లో హాజరు శాతం పెంచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్లను తగ్గించడం తదితర కారణాలున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు, విద్యార్థులకు మరింత పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు పాఠశాలలపై ఆసక్తిని పెంచేందుకు సీఎం విజయ్ ఈ అంశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందుతోంది. 11, 12వ తరగతులు (ఇంటర్మీడియట్) చదివే విద్యార్థులకు కూడా పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఒకవేళ అది అమలైతే అప్పుడు విద్యార్థుల సంఖ్య దాదాపు 48 లక్షలకు చేరుతుంది.
కాగా ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో వారానికి ఒకసారి కేవలం వెజిటబుల్ బిర్యానీ లేదా పులావ్ మాత్రమే మెనూలో భాగంగా ఇస్తున్నారు. దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు కేవలం గుడ్లు, అరటిపండ్లు లేదా పాలు మాత్రమే అదనపు పోషకాహారంగా అందిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు గతంలో చికెన్ కర్రీ ఇస్తామని ప్రకటించినప్పటికీ, అది కొన్ని నెలల ప్రత్యేక ప్యాకేజీగా మాత్రమే ఉంది తప్ప నిరంతరంగా వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ ఇచ్చేలా ఏ రాష్ట్రం కూడా శాశ్వత ప్రతిపాదనలు సిద్ధం చేయలేదు.
తొలిసారిగా మిడ్డే మీల్
భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం తమిళనాడే. బ్రిటీష్ కాలంలో (1920లలో) మద్రాస్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని పాఠశాలల్లో దీన్ని చిన్నస్థాయిలో ప్రారంభించగా, ఆ తర్వాత ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కె. కామరాజ్ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగావిస్తరింపజేశారు.ఇప్పుడు విద్యార్థుకు చికెన్ బిర్యాణీ పెడితే మరోసారి తమిళనాడు రికార్డు సృష్టించనుంది.


