ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఇది ఊతం ఇస్తుంది: రేవంత్ రెడ్డి | This will boost investments in the Future City Revanth Reddy | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఇది ఊతం ఇస్తుంది: రేవంత్ రెడ్డి

Jul 15 2026 10:30 PM | Updated on Jul 15 2026 10:30 PM

 This will boost investments in the Future City Revanth Reddy

హైదరాబాద్‌: ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఈ శంకుస్థాపన కార్యక్రమం ఫ్యూచర్ సిటీకి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలకు మంచి ప్రోత్సాహకంగా ఉపయోగపడనుందనిప్పారు. 

‘‘ఫ్యూచర్ సిటీలో అత్యంత అధునాతనమైన నగరాన్ని నిర్మించాలని, ఫార్చ్యూన్-500 కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడానికి 2025 డిసెంబర్ లో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించాం. 108 దేశాల నుంచి 3 వేల మంది వివిధ దిగ్గజ కంపెనీల నుంచి కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణను 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే "తెలంగాణ రైజింగ్-2047" లక్ష్యం. వికసిత భారత్ 2047 లక్ష్యం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ గా భారత్ ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా జాతీయ జీడీపీలో తెలంగాణ తన వాటాను ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 10 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్టుబడులు, ఉద్యోగ కల్పన కీలకం.. ఇందులో భాగంగా, పరిశ్రమల కల్పనకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు, అనుమతులను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2034 నాటికి అమెజాన్ సంస్థ లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలి.

ప్రతి నెల పరిశ్రమల స్థాపనకు సంబంధించి అన్ని అంశాలపై సమగ్ర రివ్యూ నిర్వహిస్తున్నాం. అమెజాన్ సంస్థ పెట్టుబడులకు సంబంధించి ప్రతి నెలా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపాలనే ఆలోచనతో తెలంగాణ రైజింగ్ పాలసీ విధానాన్ని రూపొందించుకున్నాం .. పరిశ్రమలు, పర్యాటకం, ఎనర్జీ, ఆరోగ్యం, స్పోర్ట్స్ లాంటి రంగాల్లో నిర్దిష్టమైన పాలసీలు రూపొందించుకున్నాం.

ఉద్యోగ కల్పన కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీను ఏర్పాటు చేసుకున్నాం. అమెజాన్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ఆ ప్రాంతాల్లో ఇతర కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడుతుంది. హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ, ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది.

ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1.34 కోట్ల మంది నివసిస్తున్నారు.. ఉద్యోగ అవకాశాలు కల్పించడం తోపాటు కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. నగరంలో ఉన్న పరిశ్రమలను తరలించే అవసరం ఉంది, మూసి నది ప్రక్షాళన, మెట్రో రైలు విస్తరించాల్సిన అవసరం ఉంది. మూడు లక్షల ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులు గా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలో డీజిల్ మీద ఆధార పడి నడుస్తున్న 2 లక్షల ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ కు టాక్స్ ను పూర్తిగా మినహాయించి హైదరాబాద్ ను కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది .. ఏడాదికి రూ 1,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దేశంలో ఇతర నగరాల్లో ఉన్న కాలుష్య సంబంధిత సమస్యలను హైదరాబాద్ లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం.

క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించాం.. సమగ్ర ప్రణాళిక తో అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. ఈ ప్రాంత రైతులను మనస్పూర్తిగా అభినందిస్తున్నా.. రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల కోస భూములను త్యాగం చేసిన రైతులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చి సహకరించిన వారిని అభినందిస్తూ .. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటూ అవసరమైన నష్ట పరిహారాన్ని అందించాలని అధికారులకు ఆదేశాలిస్తున్నా.

భూమి ఇచ్చి అభివృద్ధికి సహకరించిన రైతులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆందోళనలు చేపడుతున్న రైతులతో చర్చించాలని మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే కె లక్ష్మా రెడ్డి గార్లకు సూచిస్తున్నా.. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించాలి.. మంచి నష్ట పరిహారాన్ని అందించాలి. అమెజాన్ సంస్థ తన కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement