కాజీపేట నుంచి వచ్చే రైళ్లు ఇక నేరుగా కాచిగూడకు వెళ్లొచ్చు
మౌలాలీ–మల్కాజిగిరి చుట్టూ తిరుగుడు సమస్య నుంచి విముక్తి
సిటీ వెలుపల నిరీక్షణకు కొంతమేర తెర.. సమయం, ఇంధనం ఆదా
3 కిలోమీటర్ల బైపాస్ లైన్ అందుబాటులోకి..
సాక్షి, హైదరాబాద్: కేవలం 3 కి.మీ. చిన్న రైల్వే బైపాస్ లైన్.. దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలో రైల్ నెట్వర్క్ను అల్లకల్లోలం చేస్తున్న ఓ పెద్ద సమస్య చిటుక్కున తీరిపోయింది. సికింద్రాబాద్ వెలుపల కొన్ని రైళ్లు సిగ్నల్ కోసం వేచి చూసే సమస్య (కొంతమేర) తగ్గటం సహా దుబారా అవుతున్న కోట్ల ప్రజాధనం ఆదా, నగరం వెలుపలి నుంచి స్టేషన్లలోకి వేగంగా రైళ్లు చేరుకోవటం, అదనంగా కొత్త రైళ్లు నడిపే వెసులుబాటు... ఇలా ఎన్నో ఉపయోగాలు కలిగాయి. కేవలం రూ.100 కోట్ల లోపు వ్యయంతో దశాబ్దాల తరబడి ఉన్న సమస్యలు తీరిపోయాయి.
లాలాగూడ దాటిన తర్వాత సీతాఫల్మండికి కలిసేలా..
ఢిల్లీ వైపు నుంచి బెంగళూరు వెళ్లే రైళ్లు కాజీపేట నుంచి కాచిగూడ మీదుగా సాగాలి. అయితే కాచిగూడకు నేరుగా వెళ్లే వీలు లేకపోవడంతో మౌలాలి–మల్కాజిగిరి–సీతాఫల్మండి మీదుగా వెళ్తున్నాయి. దాదాపు 15 కి.మీ. మేర చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇందుకు దాదాపు అరగంట సమయం పడుతోంది. మరోవైపు ఆ మార్గంలో వెళ్లే ఇతర రైళ్లను ఇవి ఆటంకపరుస్తున్నాయి. కొన్ని రైళ్లు సిటీ వెలుపల సిగ్నల్ కోసం ఎదురు చూడాల్సి న పరిస్థితి ఉంది. ఒక్కోసారి గంటసేపు కూడా ఆగిపోతున్నాయి.
ఇంకోవైపు చుట్టూ తిరగాల్సి రావటంతో ఇంధన వృధా అవుతోంది. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతుండగా.. ఇటీ వల ఈ సమస్య పరిష్కారానికి రైళ్లు నేరుగా కాచిగూడకు వెళ్లేలా 3 కి.మీ. బైపాస్ లైన్ను నిర్మించారు. కాజీపేట నుంచి సికింద్రాబాద్ వచ్చే మార్గంలో మౌలాలి–లాలాగూడ దాటిన తర్వాత ఈ కొత్త బైపాస్ లైన్ మొదలై నేరుగా సీతాఫల్మండి లైన్కు కలుస్తుంది. అక్కడి నుంచి నేరుగా కాచిగూడ స్టేషన్లోకి చేరుకునే వెసులుబాటు కలిగింది. బుధవారం నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. దీంతో రైళ్లు నేరుగా కాచిగూడకు వెళ్తున్నాయి.
ఇవీ ప్రయోజనాలు
కాజీపేట–కాచిగూడ మధ్య నిత్యం సగటున 35వరకు రైళ్లు తిరుగుతున్నాయి. ఇవన్నీ ఇప్పు డు దూరాభారాన్ని తప్పించుకున్నాయి. ఇక వీటి అదనపు తిరుగుడు వల్ల ట్రాఫిక్ చిక్కులు నెలకొని మరో 45 రైళ్లు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇప్పుడు ఈ రైళ్లన్నీ సాఫీగా ముందుకు సాగేందుకు వెసులుబాటు కలిగింది. భవిష్యత్తులో ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్యను కూడా పెంచేందుకూ ఇది దోహదం చేస్తుంది.
స్థలం ఉన్నా ఆలస్యం.. కేంద్రం దృష్టి పెట్టడంతో..
ఈ కొత్త బైపాస్ లైన్ను రైల్వే స్థలంలోనే నిర్మించారు. ఇన్ని దశాబ్దాలుగా అక్కడ స్థలం అందుబాటులో ఉన్నా బైపాస్ లైన్ నిర్మించలేకపోయారు. అది జనావాసాల మధ్య గుండా ఉన్నందున , కొత్తలైన్ నిర్మించటం ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని అధికారులు దాన్ని పక్కనపెట్టారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం బైపాస్ లైన్లకు ప్రాధాన్యం ఇస్తూ దీన్ని కూడా పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిర్మాణ ప్రాంతం నుంచి మట్టి కిందకు దొర్లకుండా రిటైయినింగ్ వాల్ నిర్మించి ఇంజినీర్ల పర్యవేక్షణలో పని పూర్తి చేశారు. ఆలుగడ్డ బావి వద్ద రైల్ ఓవర్ రైల్ వంతెనతోపాటు ఐదు చిన్న వంతెనలు అందుబాటులోకి వచ్చాయి.
కొత్తలైన్ తనిఖీ చేసిన జీఎం
బుధవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాత్సవ ఈ కొత్త లైన్ను ట్రాలీ ద్వారా తనిఖీ చేశారు. అక్కడి ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించారు. దీని ఉపయోగాలను అధికారులను అడిగి తెలుసుకు న్నారు. క్లిష్టమైన ప్రాజెక్టును పూర్తి చేసినందుకు అధికారులను అభినందించారు.


