న్యూఢిల్లీ: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో కేంద్రం ఓడల యజమాన్యాలు, నిర్వాహకులు, రిక్రూట్మెంట్ సంస్థలకు కొత్త అడ్వైజరీ విడుదల చేసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (డీజీఎమ్ఏ) ఆదేశించింది.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ రూట్లో భారతీయులను నియమించొద్దని స్పష్టం చేసింది. ఇటీవల వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో ఇద్దరు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం ఈ భద్రతా చర్యలు తీసుకుంది.
మధ్యప్రాచ్యంలో మారుతున్న భద్రతా పరిస్థితిని తాము నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, భారతీయ నావికుల భద్రత, రక్షణ, సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని డీజీఎంఏ తెలిపింది. భారతీయ నావికుల భద్రత కోసం మరికొన్ని ముందుజాగ్రత్త చర్యలను కూడా డీజీఎంఏ పేర్కొంది.


