అమెరికా–ఇరాన్ల మధ్య గతవారం రోజులుగా అడపాదడపా సాగుతున్న దాడులు మంగళవారానికల్లా మరింత ఉగ్రరూపం దాల్చాయి. ఇప్పటికే అమెరికా స్థావరాలపై ఇరాన్ చేసిన దాడులు ఇద్దరు భారతీయ నావికుల ప్రాణాలు తీశాయి. దక్షిణ ఇరాన్పై అమెరికా సాగించిన దాడుల్లో 30 మంది పౌరులు, ఏడుగురు సైనికులు మరణించటం, దాదాపు 260 మంది గాయపడటం గమనిస్తే గతానికి మించి ఈసారి పౌర ప్రాంతాలను అమెరికా లక్ష్యంగా చేసుకుందని తెలుస్తుంది. అంతేకాదు... అరుదుగా చేసే పగటిపూట దాడులు కూడా మొదలెట్టింది. ఇరాన్ సైతం అమెరికా మిత్ర దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది.
గత నెల 17న ఇరు దేశాలమధ్యా కుదిరిన శాంతి ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు చిత్తశుద్ధి లేదని అమెరికన్ కాంగ్రెస్లోని పాలక, విపక్ష నేతలు గ్రహించారు. యుద్ధం ఎప్పుడో అయిపోయిందని బొంకటం మొదలుకొని కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని చెప్పడం వరకూ ట్రంప్ ఒక పథకం ప్రకారం నడిపించారు. తన అధికారాలకు పరిమితులు విధిస్తూ యుద్ధ అధికారాల చట్టంకింద సెనేట్లోనూ, ప్రతినిధుల సభలోనూ చేసిన రెండు తీర్మానాలతో బెంబేలెత్తిన ట్రంప్ మొదట యుద్ధం ఎప్పుడో ఆగిందని అబద్ధమాడారు. మరికొన్ని రోజులు గడిచాక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని, శాంతి ఒప్పందం దిశగా ఇది తొలి అడుగ న్నారు. తీరా ఇప్పుడు మళ్లీ యుద్ధ భేరి మోగించారు.
నిజానికి అమెరికా దాడులు ఆపింది ఎప్పుడూ లేదు. ఏదో వంకతో ఇరాన్పై కొనసాగిస్తూనే ఉంది. కేవలం కొంత వ్యవధి గడిచింది గనుకే యుద్ధం మొదలైనట్టు అధికారికంగా కాంగ్రెస్కు వర్తమానం పంపారు. పర్యవసానంగా 60 రోజులపాటు మళ్లీ యుద్ధం సాగించవచ్చన్నది ఆయన వ్యూహం. ఇది చెల్లుబాటు కాదనీ, ఈ విషయంలో ట్రంప్ ఇష్టారాజ్యం సాగనివ్వబోమనీ ఇరు పార్టీల ప్రతినిధులూ చెబుతున్నది ఆచరణలో ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి. గ్యాస్ ధరలు అపరిమితంగా పెరగటం, ఇతరేతర సరుకులు సైతం అందుబాటులో లేకపోవటంతో జనం బెంబే లెత్తుతుండగా మరిన్ని దాడులతో ఇరాన్ దారి కొస్తుందని ట్రంప్ కలగంటున్నారు. ఇరాన్తో లడాయి మొదలయ్యాక గ్యాస్ కోసం అమెరికా ఇంతవరకూ 5,640 కోట్ల డాలర్లు అదనంగా వెచ్చించిందని డెమాక్రాట్ల ఆధ్వర్యంలోని ఉమ్మడి ఆర్థిక కమిటీ అంచనా వేసింది. తాజా పరిణామాలతో వార్షిక రక్షణ విధాన బిల్లు ప్రవేశించకుండా సెనేట్లో 50–46 ఓట్ల తేడాతో నిరోధించటంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడ్డారనే చెప్పాలి. సొంత పార్టీకి చెందినవారే అడ్డం తిరగటంతో బిల్లు సభాప్రవేశానికి అవసర మైన 60 ఓట్లు లభించలేదు.
హార్మూజ్ జలసంధి విషయంలో ఏం చేయాలో ట్రంప్కు పాలుబోవడం లేదని ఆయన పరస్పర విరుద్ధ ప్రకటనలే చెబుతున్నాయి. ఇకపై హార్మూజ్లో నౌకల రాక పోకలు సక్రమంగా జరిగేలా చూడటం తమ బాధ్యతనీ, అందుకు 20 శాతం సుంకం వసూలు చేస్తామనీ ప్రకటించి 24 గంటలు గడవకుండా మాట మార్చారు. దేశదేశాల అధినేతలూ అమెరికాలో వందలకోట్ల డాలర్లు పెట్టుబడి పెడతామనటంతో నిర్ణయం మారిందట! అమెరికా, దాని మిత్రపక్షాలూ ఎప్పటిలాగే స్వేచ్ఛాయుత హార్మూజ్ కొన సాగాలని కోరుతూ రాగా, ఇప్పుడు అందుకు విరుద్ధమైన ప్రకటన రిపబ్లికన్లను సైతం దిగ్భ్రమపరిచింది. అంతర్జాతీయ జలరవాణా మార్గంపై ఏ దేశమైనా ఎలా పెత్తనం చేస్తుందన్న వారి ప్రశ్నకు ట్రంప్ దగ్గర జవాబు లేదు.
సాధారణ సమయాల్లో హార్మూజ్ను రోజుకు 130 రవాణా నౌకలు దాటేవి. అవికాస్తా సోమవారానికి 10కి పడిపోయాయి. తాజా దాడుల తర్వాత అది పూర్తిగా స్తంభించి పోయింది. యుద్ధాలు, అస్థిరత చమురు కార్పొరేషన్లకు అసాధారణ లాభాలు తెస్తాయి. కానీ చమురు, సహజవాయు దిగుమతులపై ఆధారపడ్డ దేశాలు ఆర్థికంగా కుంగి పోతాయి. పర్యావరణ పరిరక్షణ కోసమైనా పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి కేంద్రీకరిద్దామని ఇన్ని దశాబ్దాలుగా ఏ దేశమూ చిత్తశుద్ధితో అనుకోలేదు. ఎక్కడో ఒకచోట తలెత్తే సంక్షోభానికి ప్రపంచమంతా మూల్యం చెల్లించే ప్రస్తుత విధానం మంచిదో, ప్రత్యామ్నాయ వనరుల ఆసరాతో ఉన్నంతలో మెరుగ్గా మనుగడ సాగించటం ఉత్తమమో ప్రపంచ దేశాలన్నీ తేల్చుకోవటం తప్ప వేరే మార్గం లేదు.


