ఈసీ కొత్త మెలిక! | Sakshi Editorial On Election Commission of India | Sakshi
Sakshi News home page

ఈసీ కొత్త మెలిక!

Jul 15 2026 1:15 AM | Updated on Jul 15 2026 1:15 AM

Sakshi Editorial On Election Commission of India

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) పేరిట దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటికే దాదాపు అయిదున్నర కోట్లమంది ఓటర్లను జాబితాల్లోంచి తొలగించి రికార్డు సృష్టించిన ఎన్నికల సంఘం(ఈసీ)... కొత్త రికార్డులు నెలకొల్పాలని తహతహలాడుతున్నట్టు కన బడుతోంది. 2002 నాటి ఓటర్ల జాబితాలో గల తమ తల్లిదండ్రుల వివరాలు పొందుపరి స్తేనే కొత్తగా 18 యేళ్లు నిండినవారూ, ఓటుహక్కు పొందదల్చుకున్న ఇతరులూ అర్హులవు తారని విధించిన తాజా నిబంధన ప్రకంపనలు రేపుతోంది. బిహార్‌తో మొదలెట్టి ఇంత వరకూ వివిధ రాష్ట్రాల్లో జరిగిన ‘సర్‌’లో లేని నిబంధన ఇప్పుడు కొత్తగా అందరి నెత్తినా పడేసింది. 2002 నాటికే తల్లిదండ్రులు మరణించివున్నా... అప్పట్లో సమయానికి ఇంట్లో లేకపోవటంవల్లనో, పనిపాటల కోసం వేరే ప్రాంతంలో ఉండటంవల్లనో వారి ఓటు హక్కు గల్లంతైవుంటే అలాంటి వాళ్ల పరిస్థితేమిటో చెప్పాలన్న స్పృహ కూడా దానికి లేకుండా పోయింది. అలాంటివాళ్లు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చనటం తప్ప మరేమీ వివరణ లేదు! తీరా ఇస్తే ఈ నిబంధన సాకుతో తిరస్కరించటం తప్ప ఒరిగేదేముంటుంది? 

ఒకరి తర్వాత ఒకరుగా వచ్చిన పాలకుల పుణ్యమా అని ఈ దేశంలో ఇతర చీడలతో పాటు నిరక్షరాస్యత కూడా నిక్షేపంగా ఉంది. 2011 నాటి లెక్కల ప్రకారం అక్షరాస్యత 74.04 శాతం. ఇప్పుడు జాతీయ సగటు 81 శాతమని అంటున్నారు. సంతకం పెట్టగలి గినపాటి జ్ఞానం వచ్చినవారిని అక్షరాస్యులుగా లెక్కేయటంవల్ల ఈమాత్రం కనబడుతోంది. తేలిగ్గా దేన్నయినా చదవగలిగేవారెందరో చెప్పలేం. అలాంటివారు ఇరవైయ్యేళ్ల క్రితం తమ ఓటు ఎక్కడుందో గుర్తుపెట్టుకుని పాత చిట్టాలు వెతకగలరా? ఒకవేళ గుర్తున్నా 2008 పునర్విభజనలో చాలా నియోజకవర్గాల పేర్లు, వాటి పరిధిలోని ఊళ్లు మారాయి గనుక వాస్తవంగా తమ ఓటు ఏ పరిధిలోకి పోయిందో తెలుసుకోలేరు. పైగా ఇది సాగు సీజన్‌. నాట్లు, యూరియా కొనుగోలు, ఇతరేతర పనుల కోసం రైతులు ఇప్పటికే తిప్పలు పడుతున్నారు. వారి పిల్లలు సైతం ఆ పనులు పంచుకుంటే తప్ప ఒక కొలిక్కి రాదు. జనాన్ని బాధించటానికి ఇంతకన్నా మంచి అదును ఈసీకి దొరకలేనట్టుంది!

ఈసీ తీసుకొచ్చిన ఈ ‘సర్‌’ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు చెప్పివుండొచ్చు. అందులో చోటు దొరకనివారు ట్రిబ్యునళ్లను ఆశ్రయించవచ్చన్న వెసులుబాటు కల్పించి వుండొచ్చు. కానీ అది నిగ్గుతేలేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. బెంగాల్‌ సంగతే తీసుకుంటే జాబితాల్లో గల్లంతైనవారు లక్షల్లో ఉండగా... ట్రిబ్యునళ్లు తేల్చిన కేసులు మూడు, నాలుగు వేలు మించలేదు. ఇలాగైతే అంతా తేలేసరికి కనీసం పాతికేళ్లు పడుతుందని న్యాయ నిపుణులు లెక్కేస్తున్నారు. ‘సర్‌’లో చోటు దొరక్కపోతే పింఛన్లు మొదలు కొని గ్యాస్‌ సిలెండర్ల సబ్సిడీ వరకూ సమస్తం ఆపేయటం కొన్ని రాష్ట్రాల్లో మొదలైంది. 

రేపో మాపో మీరు ఈ దేశ పౌరులు కాదు... ఇక్కడ ఉండటానికి అనర్హులని చెప్పినా ఆశ్చర్యం లేదు. పోనీ ఈసీ ‘స్వచ్ఛమైన’ జాబితాను రూపొందించగలుగుతోందా? పరకాల ప్రభాకర్‌ వంటి సామాజికవేత్తలు చెబుతున్నదాన్నిబట్టి చూస్తే యూపీలో కొన్ని చిరునామాల్లో వందలమంది ఓటర్లు నమోదైవున్నారు. ఇలాంటి ఆరోపణలకు ఈసీ వివరణ ఇచ్చిన దాఖలా లేదు. అసలు అలాంటి బాధ్యత ఉన్నట్టు కూడా అది గుర్తించే స్థితిలో లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల టీడీపీ కార్యాలయాల్లో, ఆ పార్టీ నేతల ఇళ్లలో ‘సర్‌’ దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలి... ఎవరికి ఇవ్వకూడదన్న నిర్ణయాలు జరుగుతున్నా యని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. మీడియాలో ఫొటోలు, వీడియోలు వస్తున్నాయి. అయినా ఈసీ ఉలకదు, పలకదు. సంబంధిత బీఎల్‌ఓలపై చర్యలుండవు. ఈ తంతు గమనిస్తే ఇది ‘తీసివేతల ఈసీ’గా కనబడుతోంది. 

గతంలో ఓటర్ల జాబితా సవరణలో కొత్తగా ఇన్ని లక్షలమంది జమ అయ్యారని... అందులో మొదటిసారి ఓటుహక్కు వచ్చినవారు ఇంతమంది అని ఈసీ గర్వంగా చెప్పుకునేది. ఇప్పుడు తీసివేతలే గర్వకారణంగా మారింది. ప్రపంచంలోనే అన్నీ డిజిటల్‌ చేశామని గొప్పగా చెప్పుకునే దేశంలో కాగితాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే స్థితి కల్పించిన ఘనత ఈసీది. మొత్తానికి ఆ సంస్థ మస్తిష్కంలో రేపటి రోజున ఎలాంటి ఆలోచనలు పుడతాయో, ఏం అమల్లోకొస్తుందో అని జనం భయపడే రోజులొచ్చాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement