కడపలో టీడీపీ నేతల అరాచకాలు రోజు రోజుకీ మితిమీరి పోతున్నాయి. ఇప్పటికే బీఎల్వోలను బెదిరించి మరీ SIR డేటాను తమ టీడీపీ యాప్ లో ఎక్కించుకుంటున్న టీడీపీ నేతలు.. మాట వినని వారిపై దాడులకు దిగుతున్నారు. కడప 26వ డివిజన్ బీఎల్వో మురళి పై అక్కడి టీడీపీ ఇంచార్జ్ మాసాపేట శివ దాడికి దిగారు. తాను కోరినట్లు బీఎల్వో అంగీకరించలేదని టీడీపీ మూకతో ఏకంగా సచివాలయాన్ని చుట్టుముట్టారు. బీఎల్వో మురళి పై వివాదానికి దిగి..దాడి చేసారు.
కేవలం తాను చెప్పిన పని చేయలేదని, మాకే ఎదురు చెప్తావా అంటూ మురళిపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. తోటి సచివాలయ సిబ్బంది వారిస్తున్న మాసాపేట శివ అనే డివిజన్ టీడీపీ కార్పొరేటర్ దాడికి దిగారు. దాదాపు గంట పాటు టీడీపీ మూకలు సచివాలయంలో హంగామా సృష్టించారు. తమపై దాడి చేశారని ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తే కనీసం ఒక్క పోలీసును కూడా సచివాలయానికి పంపలేదు.
మరో వైపు అధికార పార్టీ నేతలు కావడంతో కేసు లేకుండా చేసేందుకు రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎట్టకేలకు బీఎల్వో మురళి కార్పొరేషన్ కి చేరుకుని కమిషనర్ కి పిర్యాదు చేశారు. అయితే పోలీసులకు పిర్యాదు చేయకుండా అతన్ని వారించినట్లు సమాచారం. తనపై అనవసరంగా దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని మురళి డిమాండ్ చేస్తున్నాడు.


