సాక్షి, విశాఖపట్నం: బోటు ప్రమాదం బాధితులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బోటు డ్రైవర్ చిన్నా.. సాక్షి టీవీతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. జగన్ ఓదార్పు ఎంతో ధైర్యం ఇచ్చిందని అంటున్నారు.
బోటు పూర్తిగా దగ్ధమవడంతో జీవనాధారం కోల్పోయా. ఈ ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. ఈ కష్ట సమయంలో జగనన్న నాతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. "నీకు అండగా ఉంటాను.. సాయం చేస్తాను" అని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఆయన మాటలతో ఎంతో ధైర్యం వచ్చింది. రేపు ఆయన విశాఖకు వస్తున్నారని తెలిసి సంతోషంగా ఉంది అని చిన్నా అన్నారు. అలాగే..
గతంలో కూడా బోటు ప్రమాదాలు జరిగినప్పుడు జగన్ ప్రభుత్వం బాధితులను ఆదుకుందని చిన్నా గుర్తుచేశారు. అప్పట్లో దెబ్బతిన్న బోట్లకు సుమారు 80 శాతం వరకు ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నామని చెప్పారు.
వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు, పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ వర్గాలు చెబుతున్నాయి.


