సాక్షి,నెల్లూరు: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో నెల్లూరులో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించడంతో పాటు, దాని కోసం పోరాటాన్ని బలోపేతం చేయడానికే టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తన స్వలాభం కోసం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టును రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ డీల్గా మార్చారని వ్యాఖ్యానించారు.
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిలిపివేత వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని సజ్జల అన్నారు. గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంపై చేసిన పోరాటం కంటే మరింత తీవ్రంగా ఈ అంశంపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే చంద్రబాబు ప్రభుత్వ విధానాల అసలు స్వరూపం అర్థమవుతుందని ఆయన అన్నారు. రాయలసీమ అభివృద్ధి, ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాధాన్యంపై మేధావులు, విద్యావంతుల మధ్య విస్తృత చర్చ జరగాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.


