సాక్షి, అమరావతి: ప్రజాహృదయనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని అమెరికాలోని వైఎస్సార్సీపీ డీఎంవీ (డీసీ, మేరీల్యాండ్, వర్జీనియా) ఎన్ఆర్ఐ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మేరీల్యాండ్ రాష్ట్రంలోని క్లార్క్స్బర్గ్లో ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ప్రవాస భారతీయులు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్పీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేత చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. భారీ కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ జీవితం, ప్రజా సంక్షేమ పాలన, రైతు సంక్షేమం, విద్య, వైద్యం, పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన చారిత్రాత్మక కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో–విజువల్ ప్రదర్శన అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ (ఎన్ఆర్ఐ వ్యవహారాలు) డాక్టర్ ప్రదీప్ చింత, వైఎస్సార్సీపీ యూఎస్ఏ అడ్వైజర్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు రమేష్ రెడ్డి వల్లూరు, వైఎస్సార్సీపీ యూత్ వింగ్ సెక్రటరీ సుబ్బు రాయాని మాట్లాడుతూ మహానేత ఆశయాలను ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సమర్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. సంక్షేమ పాలనకు కొత్త దిశను చూపారని పేర్కొన్నారు.


