నాగార్జున యాదవ్ను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అక్రమ అరెస్టు
తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు సర్కారు కుటిల రాజకీయం
ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు
అడ్డుకోబోయిన భార్యను బూతులు తిడుతూ బలవంతంగా లాక్కెళ్లిన వైనం
ఒక్క రోజులో మూడు పోలీస్స్టేషన్లు తిప్పి వేధింపులు
గుంటూరు రూరల్/సాక్షి, హైదరాబాద్: తన ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో వెనకడుగుపై ప్రశి్నస్తున్న వారిపై అక్రమ కేసులతో తీవ్ర కక్ష సాధింపులకు దిగుతున్న చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. పొరుగు రాష్ట్ర సీఎంగా ఉన్న తన శిష్యుడి ప్రభుత్వం అండతో మరింతగా రెచ్చిపోతూ వేధింపులకు గురిచేస్తోంది. ఎప్పుడో రెండేళ్ల క్రితం తెలంగాణ సీఎంను విమర్శించారనే నెపంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను ముప్పుతిప్పలు పెట్టేలా ఇప్పుడు వ్యూహం రచించింది.
అక్కడ కేసు పెట్టించి, ఇక్కడికొచ్చి పట్టుకుపోయేలా స్కెచ్ వేసింది. ఈ క్రమంలో ఆదివారం చెప్పాపెట్టకుండా వచ్చిన తెలంగాణ పోలీసులు.. నాగార్జున యాదవ్ను అదుపులోకి తీసుకుని గుంటూరు నల్లపాడు పోలీస్స్టేషన్కు తరలించారు. ఆపై హైదరాబాద్ పురానాహవేలిలోని టాస్్కఫోర్స్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ రెండు గంటలు నిర్బంధించారు. అనంతరం బేగంబజార్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఇలా ఒక్క రోజులోనే మూడు పోలీస్స్టేషన్లు తిప్పి తీవ్ర వేధింపులకు పాల్పడ్డారు. ఈ తతంగంలో కర్త, కర్మ, క్రియ ఏపీ ప్రభుత్వమేనన్నది బహిరంగ రహస్యం.
సివిల్ డ్రెస్లో వచ్చి లాక్కెళ్లారు
గుంటూరులోని తన మామ ఇంట్లో ఉన్న నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు ఆదివారం అక్రమంగా అరెస్టు చేశారు. ఎటువంటి సమాచారం లేకుండా, నోటీసులు సైతం ఇవ్వకుండా సివిల్ డ్రెస్లో వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తాము హైదరాబాద్ సిటీ బేగంబçజారు పోలీస్స్టేషన్ నుంచి వచ్చామని, అరెస్టు విషయంపై నల్లపాడు పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చామన్నారు. అయితే, విషయం తమకు స్పష్టంగా చెప్పాలని కుటుంబ సభ్యులు అడ్డుకోబోతే.. బూతులు తిడుతూ నాగార్జున యాదవ్ను లాక్కెళ్లారని ఆయన భార్య వాపోయారు.
ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇంతగా దౌర్జన్యం చేస్తూ.. వేధిస్తారా అని ఆమె మండిపడ్డారు. వెంటనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇచ్చినా ఎలాంటి స్పందనలేదని నాగార్జున మామ అన్నారు. తెలంగాణ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఆయన్ను అరెస్టు చేస్తున్నామని పోలీసులు తెలిపినట్లు సమాచారం.
టీపీసీసీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదుతో బేగంబజార్ పోలీసులు బీఎన్ఎస్లోని 192, 352, 353 (1), 353 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాగార్జున యాదవ్ను సోమవారం న్యాయస్థానంలో హాజరు పరుస్తామని ఓ అధికారి తెలిపారు. అయితే, వచ్చిన వారు తెలంగాణ పోలీసులా లేక ఏపీ పోలీసులా అని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కనీసం మహిళ అని కూడా చూడకుండా నాగార్జున యాదవ్ భార్యను సైతం బూతులు తిట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.


