ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ఆడిట్‌ | Outsourcing agencies audit | Sakshi
Sakshi News home page

ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ఆడిట్‌

Jul 13 2026 4:30 AM | Updated on Jul 13 2026 4:30 AM

Outsourcing agencies audit

వాటిపై వ్యూహాత్మక పర్యవేక్షణకు ప్రభుత్వం నిర్ణయం 

జీఏడీ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు  

‘సాక్షి’లో వరుస కథనాలపై కదిలిన ప్రభుత్వ యంత్రాంగం 

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

సాక్షి, హైదరాబాద్‌: ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతన చెల్లింపులు, వారికి అందాల్సిన ఆర్థిక లబ్ధి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెలల తరబడి వేతన చెల్లింపులు చేయకపోవడం, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ చందా చెల్లింపుల్లో జాప్యం తదితర అంశాల్లో నెలకొన్న అవకతవకలు, అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఉపక్రమించింది. ఈ అంశాలపై ‘సాక్షి’ప్రచురిస్తున్న వరుస కథనాలపై కదిలిన ప్రభుత్వ యంత్రాంగం ఈ దిశగా చర్యలు మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల నిర్వహణను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీకి మెంబర్‌ కన్వీనర్‌గా రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌ వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా కార్మిక శాఖ కార్యదర్శి డి.హరిచందన, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఈవీవీ నాగేశ్వరరావు, ఆడిట్‌ విభాగం సంచాలకులు ద్రాక్షామణి, జీఏడీ నామినేటెడ్‌ పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఈ నెల 7న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి సంబంధించిన ఏజెన్సీలపై ఈ కమిటీ ఆడిట్‌ నిర్వహిస్తుంది.  
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్నారు. వారి సంక్షేమం, చట్టబద్ధ హక్కులు, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. 
⇒ లేబర్‌ లైసెన్స్, కనీస వేతనాలు వంటి చట్టాలను ఏజెన్సీలు పాటిస్తున్నాయా అనే విషయాన్ని ఈ కమిటీ పరిశీలించాలి. 

ఉద్యోగుల జీతాలు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించేందుకు ఆడిట్‌ నిర్వహించాలి. 
⇒ ఉద్యోగుల ఈఎస్‌ఐ, పీఎఫ్, ప్రొఫెషనల్‌ ట్యాక్స్, కనీస వేతనాల చట్టం, కాంట్రాక్ట్‌ లేబర్‌ చట్టం అమలును పరిశీలిస్తారు. 
⇒ ఉద్యోగులకు జీతాలు డీబీటీ పద్ధతిలో బ్యాంక్‌ ఖాతాల్లో సకాలంలో జమ అవుతున్నాయా లేదా చూడాలి. 
⇒ హాజరు రిజిస్టర్లు, వేతన రిజిస్టర్లతోపాటు ఏజెన్సీల వాస్తవ కార్యకలాపాలను ధ్రువీకరించుకోవాలి. ప్రభుత్వ శాఖలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలును పరిశీలించాలి. 

⇒ ఉద్యోగుల సంక్షేమానికి విఘాతం కలిగించే లోపాలు, అక్రమాలను గుర్తించి పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు సూచనలు కమిటీ ఇవ్వాలి. భవిష్యత్తులో ఔట్‌సోర్సింగ్‌ నియామకాల కోసం మార్గదర్శకాలు రూపొందించాలి. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నియామక విధానం, వేతనాలు, సేవా నిబంధనలను సమీక్షించాలి. 
⇒ ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు, ఉద్యోగుల పూర్తి సమాచారాన్ని నమోదు చేసి కేంద్రీకృత పర్యవేక్షణ కోసం పోర్టల్‌లో ప్రత్యేక మాడ్యూల్‌ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా కమిటీ పరిశీలిస్తుంది. 

⇒ ఈ కమిటీకి ప్రభుత్వ శాఖలు పూర్తిగా సహకరించాలి. ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల వివరాలు, ఉద్యోగుల సంఖ్య, ఆధార్‌ ధ్రువీకరణ, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వివరాలు, జీతాల చెల్లింపు వివరాలు, జీతాలు చెల్లించిన విధానం, సమయపాలన తదితర వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలి. ఇందుకోసం ప్రతి శాఖ ఒక నోడల్‌ అధికారిని నియమించుకోవాలి. ఈ కమిటీ 45 రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలి. 
⇒ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ పులి లక్ష్మయ్య ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement