రెండో దశ కౌన్సెలింగ్‌పై ఆశలు | Students Show Interest in Computer-Related Engineering Courses | Sakshi
Sakshi News home page

రెండో దశ కౌన్సెలింగ్‌పై ఆశలు

Jul 13 2026 3:24 AM | Updated on Jul 13 2026 3:24 AM

Students Show Interest in Computer-Related Engineering Courses

టాపర్లంతా డీమ్డ్‌ వైపు..కు విముఖత 

కంప్యూటర్‌ కోర్సులపై 25 వేల ర్యాంకు లోపు విద్యార్థుల ఆసక్తి 

సీటు వస్తుందనే నమ్మకంతో రిపోర్టుకు దూరంగా ఉండే యోచన 

రెండో దశలోపే యాజమాన్య సీట్ల భర్తీ 

ప్రైవేటు కాలేజీల వ్యూహ రచన

సాక్షి, హైదరాబాద్‌: తొలి విడత ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌తో నిరాశ కలిగిన విద్యార్థులు రెండో విడతపై ఆశలు పెట్టుకుంటున్నారు. వచ్చేవారం మొదలయ్యే మరో విడత కౌన్సెలింగ్‌కు సన్నద్ధమవుతున్నారు. సీట్లు వచ్చినా ఇష్టం లేని బ్రాంచీ, కాలేజీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. మంచి కాలేజీ, బ్రాంచీలో సీట్లు వచ్చిన విద్యార్థులు మాత్రం ఆమోదం తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 14లోగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. ఇది చేయని పక్షంలో కేటాయించిన సీటు రద్దవుతుంది. అయినప్పటికీ రెండో విడత కౌన్సెలింగ్‌కు వెళ్లే అర్హత ఉంటుంది.  

వాళ్ల ఆప్షన్లే కీలకం 
రాష్ట్రవ్యాప్తంగా 88,053 ఇంజనీరింగ్‌ సీట్లు ఉంటే, తొలి దశలో 79,891 సీట్లు కేటాయించారు. ఇంకా 8,162 సీట్లు మిగిలిపోయాయి. సీట్లు పొందిన వారిలో 10 వేల లోపు ర్యాంకు ఉన్నవాళ్లు 6,616 మంది మాత్రమే ఉన్నారు. 10 నుంచి 25 వేల ర్యాంకు వచ్చిన విద్యార్థులు 11,458 మంది ఉన్నారు. రెండో దశ కౌన్సెలింగ్‌లో 1–10 వేల లోపు ర్యాంకర్లు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసేది తక్కువగానే ఉంటారు. వీళ్లంతా జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీలు లేదా ఐఐటీల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది కాకపోతే ప్రైవేటు డీమ్డ్‌ కాలేజీలు తక్కువ ఫీజుతో వీరికి సీట్లు ఇచ్చే వీలుంది.

దీంతో 20 వేలపైన ర్యాంకు ఉండే విద్యార్థులు రెండో దశలో ఇంకాస్త ముందుకు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే, 75 వేల నుంచి లక్ష ర్యాంకు వచ్చిన విద్యార్థుల్లో 11,753 మందికి తొలి దశలో సీట్లు వచ్చాయి. వీరిలో చాలామందికి సివిల్, మెకానికల్‌ వంటి బ్రాంచీల్లో సీట్లు వచ్చాయి. పెద్దగా పేరున్న కాలేజీలు కూడా కావు. దీంతో వీరిలో 40 శాతం మంది విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లకు ప్రయత్నిస్తారు. లక్షపైన ర్యాంకున్న విద్యార్థులకు తొలి దశలో 18,763 సీట్లు కేటాయించారు. వీరిలో కూడా కొంతమంది మెరుగైన బ్రాంచీల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రతీ విద్యార్థి చూపంతా రెండో విడత కౌన్సెలింగ్‌పై ఉంది. 

మేనేజ్‌మెంట్‌ వల 
విద్యార్థులు ఎప్పటిలాగే ఈసారి కూడా కంప్యూటర్‌ సైన్స్, ఎమర్జింగ్‌ కోర్సులనే ఎంచుకున్నారు. ఈ బ్రాంచీల్లో 62,509 సీట్లు ఉన్నాయి. వీటిలో 58,376 సీట్లు భర్తీ అయ్యాయి. ఇక మిగిలిన సీట్లు 4,133 మాత్రమే. ఇవి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సీట్లు. మేనేజ్‌మెంట్‌ సీట్లు 35 వేలకుపైగా ఉంటాయి. వీటిని భర్తీ చేసుకునేందుకు ప్రైవేటు యాజమాన్యాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. సీఎస్‌ఈ, డేటాసైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఏఐఎంఎల్‌ వంటి సీట్లకు భారీగా గిరాకీ ఉండటంతో ఈ సీట్లకు పెద్దఎత్తున డొనేషన్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

తొలి కౌన్సెలింగ్‌లో సీటు రాని వారిని గుర్తించి, మేనేజ్‌మెంట్‌ సీట్లలోకి తీసుకునేందుకు ఏజెన్సీలు, పీఆర్‌వోలు చురుగ్గా పనిచేస్తున్నారు. 25 వేల పైన ర్యాంకు వచ్చిన విద్యార్థులు ఎమర్జింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో చేరేందుకు తేలిగ్గా ఒప్పుకుంటారనేది మేనేజ్‌మెంట్ల ఆలోచన. లక్షకుపైగా ర్యాంకు ఉన్న విద్యార్థులు సివిల్, మెకానికల్‌తోపాటు ఈసీఈ, ఈఈఈ వంటి కోర్సుల్లో తక్కువ డొనేషన్‌తో చేర్చుకునేందుకు యాజమాన్యాలు ఆసక్తి చూపుతున్నాయి. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల విక్రయాలను త్వరగా ముగించేందుకు ప్రైవేటు యాజమాన్యాలూ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. రెండో దశ కౌన్సెలింగ్‌లోపే ఈ సీట్ల భర్తీ చేస్తే ఆశించిన మేర డిమాండ్‌ చేయొచ్చని భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement