బీఆర్ఎస్ మాజీమంత్రిపై విరుచుకుపడిన కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయాలన్న డిమాండ్తో నాలుగైదు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య సాగుతున్న మాటల యుద్ధంలో భాగంగా మాజీమంత్రి హరీశ్రావు టార్గెట్గా కాంగ్రెస్ నేతలు ఆదివారం విరుచుకుపడ్డారు.
కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం లోపలేపిస్తా: విప్ అద్దంకి
ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ బరాజ్లు నేలమట్టమవుతాయని చెబుతుంటే హౌలేగాడిలా నీళ్లు ఎత్తిపోయాలని హరీశ్ మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్రెడ్డి మ్యాప్ వేసి చూయించినా మ్యాడ్ ఫెలోకి అర్థం కావడం లేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనవాళ్లు కేసీఆర్ చెడగొట్టాడని, ప్రాణహిత చేవెళ్లకు కాళేశ్వరం పేరు పెట్టి కమీషన్లు దండుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుకుతిన్న కల్వకుంట్ల కుటుంబానికి సిగ్గు, లజ్జ ఉంటే సప్త సముద్రాలు దాటిపోవాలని, లేదంటే తనకు ఒక గంట అధికారమిస్తే ఆ కుటుంబం మొత్తాన్ని లోపలేస్తానని అద్దంకి వ్యాఖ్యానించారు.
సైకోలా మారి రైతులను తప్పదోవ పట్టించే ప్రయత్నం: విప్ ఆది శ్రీనివాస్
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీశ్రావు అబద్ధాల వరద పారిస్తున్నాడని, ఆయన చదివింది పాలిటెక్నిక్ అయినా పెద్ద ఇంజనీర్లా పోజులు కొడుతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మేడిగడ్డ తెలంగాణకు గుండెకాయ అన్నారని, అది జారిపోయిందని, అసలు ఈ ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తే ప్రమాదమని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ సూచించిందని చెప్పారు. ఊర్లు కొట్టుకుపోయినా సరే రాజకీయాలే ముఖ్యమన్నట్టు బీఆర్ఎస్ నేతల తీరు ఉందని, హరీశ్రావు సైకోలా మారిపోయి రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
రక్తం చిందించే ధైర్యం హరీశ్రావుకు లేదు: జగ్గారెడ్డి
‘తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు పెట్రోల్ తెచ్చుకొని అగ్గిపెట్టె మర్చిపోయిన హరీశ్రావు ఎంతో మంది యువకుల బలిదానాలకు కారణమయ్యాడు. హరీశ్రావుకు అంత ధైర్యం లేదు. ఆయన రక్తం చిందించమని అడిగినా చిందించడు. అసలు రక్తం చిందించే ధైర్యం హరీశ్రావుకు లేదు.’అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చగొట్టే మనస్తత్వం కేసీఆర్ కుటుంబానికి ఉందని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డిని ఏదో ఒకటి అనాలి అనే లైన్లోనే హరీశ్రావు వెళుతున్నారు తప్ప ఆయనకు ప్రజలు, రైతులు అవసరం లేదని, కేవలం రాజకీయమే ముఖ్యమని చెప్పారు.
ఆయనది కసబ్ క్యారెక్టర్ : మెట్టు సాయికుమార్
హరీశ్రావుది కసబ్ లాంటి మనస్తత్వమని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని దివాళా తీయించడంలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో హరీశ్రావు పాత్ర కూడా అంతే ఉందన్నారు. రేవంత్రెడ్డి గురించి మాట్లాడే అర్హత చిల్లర మాటలు మాట్లాడే హరీశ్రావుకు లేదని చెప్పారు.


