‘ఇది రేవంత్ రెడ్డి రక్కసి పాలనకు నిదర్శనం’ | Dasoju Sravan Kumar Slams CM Revanth Comments | Sakshi
Sakshi News home page

‘ఇది రేవంత్ రెడ్డి రక్కసి పాలనకు నిదర్శనం’

Jul 12 2026 9:48 PM | Updated on Jul 12 2026 9:51 PM

Dasoju Sravan Kumar Slams CM Revanth Comments

హైదరాబాద్: తమ రక్తాన్ని చెమటగా చిందించి, రేయింబవళ్లు కష్టపడి దేశానికి అన్నం పండించే అన్నదాతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సాగునీరు లేక పంటలు ఎండిపోతుంటే రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని, కనీసం నీళ్లివ్వడం చేతకాని రేవంత్ రెడ్డి.. 'మీ ఒంటి రక్తాన్ని చల్లి పంటలు పండించుకోండి' అనే రేంజ్‌లో మాట్లాడటం దుర్మార్గమన్నారు. 

ఈ తరహా వ్యాఖ్యలు తెలంగాణలో మరో రైతుల రక్త చరిత్రకు నాంది పలుకుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏనాడూ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అన్నం పెట్టే రైతుపై ఇంతటి క్రూరమైన, హేయమైన, అరాచకమైన భాషను వాడలేదని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష ఇదేనా అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీస్తూ డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్రమైన ప్రశ్నలు సంధించారు..
1. నువ్వు అసలు ముఖ్యమంత్రివా? లేక రక్త దాహం మరిగిన మృగానివా? రైతు కష్టాన్ని గౌరవించడం చేతకాని రేవంత్ రెడ్డి.. నువ్వు కూర్చున్నది ప్రజాస్వామ్యబద్ధమైన ముఖ్యమంత్రి కుర్చీనా లేక రక్తం మరిగిన మృగం అరాచక పీఠమా?
2. పంట పొలాలకు నీళ్లు అడిగితే రక్తం చల్లుకోమంటావా? కనీస మానవత్వం, ఇంగితజ్ఞానం, సభ్యత లేని ఇటువంటి భాష మాట్లాడటానికి నీకు నోరెలా వచ్చింది?
పేద ప్రజల సొమ్మును 'బకాసురుడి' లెక్క దోచుకు తింటూ, అధికారం నెత్తికెక్కి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హత ఎంతమాత్రం లేదని, ఆ హక్కు అంతకన్నా లేదని శ్రవణ్ దాసోజు స్పష్టం చేశారు. ఏ రైతు కన్నీరు పెడితే దేశంలో సామ్రాజ్యాలు కూలిపోయాయో, అదే విధంగా రేవంత్ రెడ్డి దోపిడీ సామ్రాజ్యం కూడా కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు.

తెలంగాణ ప్రజలు నీళ్ల కష్టాలను శాశ్వతంగా తొలగించుకునేందుకు, స్వయంపాలనలో సగర్వంగా బతికేందుకే కదా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదని ఆయన గుర్తు చేశారు. "మన కళ్ల ముందే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఉన్నా.. వాటి పంపులు ఆన్ చేయకుండా సాగుభూములను కావాలనే ఎండబెడుతున్నారు. రైతులను రక్తం చుక్కలు చిందించమంటూ వెటకారాలు మాట్లాడుతున్నారు. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి.. ఏ రైతు కన్నీరైతే నీకు వెటకారంగా అనిపిస్తోందో, అదే రైతు ఆగ్రహావేశాల ఉప్పెనలో నీ ఈఎంఐ (EMI) కుర్చీ కాలి బూడిదవడం ఖాయం!" అని హెచ్చరించారు.

రైతు ఆగ్రహానికి బలైన ఏ పాలకుడూ చరిత్రలో బతికి బట్టకట్టలేదని డాక్టర్ శ్రవణ్ దాసోజు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అహంకారం తలకెక్కి అన్నదాతలను అవమానిస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోబోదన్నారు. కరువు ఛాయలతో రాష్ట్రంలో రైతాంగం తల్లడిల్లుతుంటే.. నీళ్లపై కక్షా రాజకీయం చేస్తూ, రక్తం గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ రాక్షసత్వానికి, క్రూరమైన భాషకు తెలంగాణ రైతాంగం త్వరలోనే తిరగబడి తగిన గుణపాఠం చెబుతుందని, ప్రజల కోర్టులో ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement