ఫీజులు, హాస్టల్ సమస్యలపై విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా
విజయనగరం గంటస్తంభం: ‘ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం, హామీలు కాదు. .హక్కులు కావాలి, చేతగాని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డౌన్డౌన్’ అంటూ విద్యార్థులు నినదించారు. స్కాలర్షిప్ బకాయిల మంజూరు, హాస్టల్ సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. విజయనగరం జిల్లాలో మంగళవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు.
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. దారిపొడవునా చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా గళమెత్తారు. ప్లకార్డులు ప్రదర్శించారు. కలెక్టరేట్లోకి వెళ్లి అధికారులకు వినతిపత్రమిచ్చేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కొందరు విద్యార్థులను పోలీసులు మెడపట్టి గెంటేయడంతో కొందరికి స్వల్పగాయాలయ్యాయి.


