రేపు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి మాండవీయ
సాక్షి, హైదరాబాద్/సాక్షి న్యూఢిల్లీ: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నిర్వహిస్తున్న సనత్నగర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన నూతన ఔట్ పేషంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ)ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం ప్రారంభించనున్నారు. రూ. 211.13 కోట్ల వ్యయంతో 43,611.04 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఓపీడీ విభాగంలో జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, డెంటల్, గైనకాలజీ, కంటి చికిత్స, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆయుష్ ఉప విభాగాలున్నాయి.
అలాగే ఫిజియోథెరపీ, రేడియాలజీ, యోగా విభాగాలు కూడా పనిచేస్తాయి. 60 పడకల వార్డులు మూడు ఉండగా... ఈ మూడింట్లో 180 సాధారణ పడకలున్నాయి. 25 ఐసీయూ, 20 ఎన్ఐసీయూ పడకలు, మందుల దుకాణం, క్లినికల్ లెక్చర్ థియేటర్ కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జంట నగరాల్లోని కారి్మక కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్న సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి 1975 మార్చి 30న ప్రారంభమైంది.
ప్రస్తుతం ఈఎస్ఐసీ 2.0 సంస్కరణల కింద రాష్ట్రంలోని 33 జిల్లాలకూ ఈఎస్ఐ సేవలు అందుతున్నాయి. సామాజిక భద్రత కింద మొత్తం 19,15,700 మంది ఈఎస్ఐ చందాదారులు, 74,32,916 మంది లబ్ధిదారులకు సేవలు అందుకుంటున్నారు. సనత్నగర్ ఈఎస్ఐసీ ఆస్పత్రి ఓపీడీ విభాగాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచే వర్చువల్గా ఏపీలోని రాజమహేంద్రవరంలో ఈఎస్ఐ ఆస్పత్రి (26 ఓపీడీ గదులు, 3 ఆధునిక మాడ్యులర్ థియేటర్లు) సహా మరో ఐదు రాష్ట్రాల్లో ఆరు ఈఎస్ఐ ప్రాజెక్టులను మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు.


