పార్లమెంటు వర్షాకాల భేటీ నేపథ్యంలో రాష్ట్ర ప్రాధాన్యతల గురించి వివరించనున్న ప్రభుత్వం
మధ్యాహ్నం 3 గంటలకు అన్ని పార్టీల ఎంపీలతో భేటీ.. ఆపై కాంగ్రెస్ ఎంపీలతో డిన్నర్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలతో ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్లో జరిగే ఈ భేటీకి హాజరు కావాలని అన్ని పార్టీలకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలు, పలు ప్రాజెక్టులకు రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతల గురించి ఈ సమావేశంలో ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివరించనున్నారు.
అన్ని పార్టీల భేటీ అనంతరం కాంగ్రెస్ ఎంపీలతో సీఎం డిన్నర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ, మెట్రో రైలు, ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర వైఖరి తదితర అంశాలపై పార్టీ ఎంపీలు అనుసరిచాల్సిన వైఖరి గురించి సీఎం రేవంత్ కాంగ్రెస్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంటులో ఏ ఎంపీ ఏ అంశంపై మాట్లాడాలనే పని విభజన చేయనున్నారు.


