ఏపీ జెన్కో అధికారులు, వినియోగదారుల సహకార సంఘంలో అక్రమాలు
పెట్రోల్ బంకు నిర్వహణలో దాదాపు రూ.7 కోట్లు పక్కదారి
సిబ్బంది సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు అధిక వడ్డీలకు ఇచ్చేసిన పెద్దలు
తెలిసినా చర్యలు తీసుకోని ఏపీజెన్కో
సాక్షి, అమరావతి: ఏపీ జెన్కో పరిధిలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్)లో ఉద్యోగులు, వినియోగదారుల సహకార సంఘంలో ఆర్థిక అక్రమాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. సంఘం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో నిర్వహిస్తోన్న హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకు లావాదేవీల్లో దాదాపు రూ.7 కోట్ల మేర నిధులు గల్లంతయ్యాయని, ఇందులో అప్పటి పాలకవర్గంతో పాటు ఉద్యోగ సంఘాల నేతల ప్రమేయం ఉందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ బంకు ద్వారా వచ్చిన ఆదాయం, ఖర్చులపై సభ్యులకు పూర్తి వివరాలు వెల్లడించలేదని ఆరోపణలున్నాయి.
హెచ్పీసీఎల్కు చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంతో సంస్థ నుంచి పలుమార్లు నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. బ్యాంక్ సూపర్వైజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభమైనప్పటికీ, పూర్తి స్థాయిలో బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. సహకార సంఘంలో సభ్యులు జమ చేసిన నిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు అధిక వడ్డీలకు అప్పులుగా ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినా, వాటికి సరైన భద్రతా పత్రాలు, రికవరీ చర్యలు చేపట్టకపోవడంతో సభ్యుల సొమ్ము ప్రమాదంలో పడిందనే ఆందోళన నెలకొంది.
తెలిసినా చర్యలు శూన్యం..
ఈ అక్రమాలపై చాలా కాలంగా ఫిర్యాదులు వచ్చినప్పటికీ, ఏపీ జెన్కో యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ విచారణలు జరిగినా, వాటి నివేదికలను పూర్తిగా అమలు చేయకపోవడం వల్లే పరిస్థితి ఇంత దూరం వచ్చిందని ఉద్యోగులు అంటున్నారు. కాగా, అక్రమాల నేపథ్యంలో 6 నెలల క్రితం సహకార సంఘం పాలకవర్గాన్ని రద్దు చేసి ప్రత్యేకాధికారిని నియమించినా ఇప్పటివరకు గల్లంతైన నిధుల రికవరీ మాత్రం పూర్తికాలేదు.
కోట్ల రూపాయల బకాయిలు వసూలు చేయకుండా, బాధ్యులపై పూర్తి చర్యలు తీసుకోకుండా మళ్లీ సంఘం ఎన్నికలకు సన్నాహాలు చేస్తుండటంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 1964లో స్థాపించబడిన ఈ సహకార సంఘంలో 500 మంది ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంస్థలోనే భారీ అక్రమాలు చోటుచేసుకోవడం, సిబ్బంది కష్టార్జిత సొమ్ము ప్రమాదంలో పడటం సభ్యులను కలవరపెడుతోంది. ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపి, గల్లంతైన నిధులను పూర్తిగా రికవరీ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.


