నాలుగు విభాగాలపై రెండేళ్లుగా నాన్చివేత.. ఖాళీలున్నా ముందుకు సాగని ప్రక్రియ
తేలని ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఉద్యోగుల పదోన్నతుల ఛానల్
ప్రభుత్వం హామీ ఇచ్చి విస్మరించిందని ఉద్యోగుల సంఘం మండిపాటు
మిగిలిన కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల ఛానల్స్ గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి
ఆయా కేటగిరీలో ఉద్యోగులకు అప్పట్లోనే దక్కిన పదోన్నతులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను చంద్రబాబు సర్కారు రెండేళ్లుగా సాగదీస్తోంది. ఇంజనీరింగ్ అసిసెంట్లు, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిసెంట్లు, వార్డు అమెనిటీస్ సెక్రటరీల పదోన్నతులపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో మొత్తం 24 కేటగిరీల ఉద్యోగులు పనిచేస్తుండగా 20 విభాగాలకు సంబంధించి పదోన్నతుల ఛానల్స్ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ఖరారు చేసి వారికి పదోన్నతులు కూడా కల్పించారు.
మిగిలిన నాలుగు విభాగాలకు సంబంధించి 2024 జూన్లో సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే పక్కన పెట్టేసింది. వారికి పదోన్నతులు కల్పించకుండా మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనైనా తమ పదోన్నతుల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందని నాలుగు విభాగాలకు చెందిన సచివాలయాల ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.
ఇంజనీరింగ్ విభాగాల్లో బోలెడు ఖాళీలు..
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఎక్కడిదక్కడే ఆగిపోయిందని ఉద్యోగుల సంఘం నేతలు పేర్కొంటున్నారు. పంచాయతీరాజ్ – ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్, రోడ్లు – భవనాలు, జలవనరులు తదితర విభాగాల్లో భారీ సంఖ్యలో మండల స్థాయి ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి ప్రాంతీయ కార్యాలయాలతో పాటు టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితర పోస్టుల్లో ఖాళీలను వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల ద్వారా భర్తీకి అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఉద్యోగుల సంఘం నేతలు పేర్కొంటున్నారు. ఏడాది క్రితం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో వీలైనంత త్వరగా ఖాళీలు ఉన్న ప్రతిచోట పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించిందని మండిపడుతున్నారు.
రేషనలైజేషన్ పేరిట ఎడాపెడా కుదింపు..
వైఎస్సార్ సీపీ హయాంలో 2019–24 మధ్య పౌర సేవలు, పథకాలను ప్రజలకు ఇంటివద్దే అందించడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచి నిర్వీర్యం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల పేరును సైతం మార్చేసింది. వలంటీర్లకు వేతనాలను పెంచకపోగా ఏకంగా వ్యవస్థనే రద్దు చేసింది. మరోవైపు రేషనలైజేషన్ పేరిట సచివాలయాల ఉద్యోగుల సంఖ్యను సగానికి కుదించింది. పౌర సేవలకు పాతర వేసి సచివాలయాల ఉద్యోగులను ఇంటింటి సర్వేలు, సమాచార సేకరణ, ఇతర విధులకు పరిమితం చేసింది.


