‘ప్రాజెక్ట్ మేఘాలయ’ కలకలం.. విజయ్ ప్రభుత్వమే టార్గెట్? | Tamil Nadu Project Meghalaya Attempt To Destabilise Government | Sakshi
Sakshi News home page

‘ప్రాజెక్ట్ మేఘాలయ’ కలకలం.. విజయ్ ప్రభుత్వమే టార్గెట్?

Jul 17 2026 7:31 AM | Updated on Jul 17 2026 7:34 AM

Tamil Nadu Project Meghalaya Attempt To Destabilise Government

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘ప్రాజెక్ట్ మేఘాలయ’ వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పథకం రచించారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసి పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయించే ప్రయత్నం జరిగిందని వచ్చిన ఆరోపణలతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వ్యవహారానికి కేంద్రబిందువుగా నిలిచింది టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఎలైయరాజా చేసిన ఫిర్యాదు. తనను కొందరు వ్యక్తులు సంప్రదించి, అసెంబ్లీలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారని ఆయన ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగా రూ.35 కోట్ల వరకు నగదు ఇస్తామని, భవిష్యత్తులో రాజకీయంగా కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరోపణల ప్రకారం, ఈ మొత్తం ప్రణాళికను ‘ప్రాజెక్ట్ మేఘాలయ’ అనే కోడ్ పేరుతో నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఈ పేరును ఎందుకు ఉపయోగించారు? దీనికి మేఘాలయ రాష్ట్రంతో ఏమైనా సంబంధం ఉందా? లేక ఇది కేవలం రహస్య కోడ్ నామమా? అనే విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి వివరణ వెలువడలేదు. దర్యాప్తు అధికారులు కూడా ఈ అంశంపై వ్యాఖ్యానించలేదు.

ఎలైయరాజా ఫిర్యాదు అనంతరం తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులను గుర్తించే పనితో పాటు, ఫోన్ కాల్ రికార్డులు, డిజిటల్ కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో యూట్యూబర్ తిరునావుక్కరసు, ఐపీడీఎస్ (IPDS) అభిప్రాయ సర్వే సంస్థతో అనుబంధం ఉన్న వ్యక్తి పేరు కూడా ప్రస్తావనకు రావడంతో దర్యాప్తు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

ఈ పరిణామాలపై అధికార టీవీకే పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించింది. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలను సహించబోమని పార్టీ నాయకులు పేర్కొన్నారు. కుట్రలో పాల్గొన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

మాకేం సంబంధం?
మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించాయి. ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాయి. ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించాయి. పూర్తి స్థాయి, నిష్పాక్షిక దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇటీవలి కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాలపై ఆరోపణలు రావడంతో, తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఈ కేసు కూడా జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. అయితే ఈ కేసులోని ఆరోపణలు నిజమా? లేదా రాజకీయ ఆరోపణలేనా? అన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు దశలో ఉంది. ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు, రూ.35 కోట్ల లంచం ప్రతిపాదన, అలాగే ‘ప్రాజెక్ట్ మేఘాలయ’ పేరుతో ప్రభుత్వం అస్థిరపరిచే కుట్ర జరిగిందనే అంశాలు ఇంకా అధికారికంగా నిరూపితం కాలేదు. దర్యాప్తు సంస్థలు సేకరించే ఆధారాలు, విచారణలో వెలుగులోకి వచ్చే వివరాలు, తదుపరి న్యాయపరమైన ప్రక్రియల ఆధారంగానే ఈ కేసు వాస్తవ స్వరూపం బయటపడనుంది.

జర్నలిస్టు విజయన్‌ను విచారించిన పోలీసులు
దర్యాప్తులో భాగంగా ఓ చానల్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు విజయ్‌న్‌ను జూలై 15, 16 తేదీల్లో చెన్నై పోలీసులు విచారించారు. ప్రధాన నిందితుడు తిరునావుక్కరసుతో విజయన్‌కు ఫోన్ సందేశాలు, ఇతర కమ్యూనికేషన్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం ఆయన మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే జర్నలిస్టుపై నేరారోపణలు చేశామని పోలీసులు ప్రకటించలేదు. ఆయనతో జరిగిన సంప్రదింపుల స్వభావంపై మాత్రమే విచారణ సాగుతోందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement