తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అవినీతిపై తన మంత్రులకు, ప్రభుత్వ యంత్రాంగానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. తన ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఎలాంటి రెండో అవకాశం (Second Chance) ఉండదని గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ.. అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని మరోసారి ప్రకటించారు.
ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తన పార్టీ చెంగల్పట్టు ఈస్ట్ జిల్లా సంయుక్త కార్యదర్శి వీరసామిని విజయ్ పార్టీ నుంచి బహిష్కరించడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చిన వీడియో వైరల్ కావడంతో.. రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవుల నుంచి ఆయనను తొలగించారు. అనంతరం పోలీసులు కూడా ఆయనను అరెస్ట్ చేశారు. అయితే వీరసామి మాత్రం ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని ఆరోపిస్తున్నాడు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం పోలీస్ విచారణ జరుగుతోంది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇస్తున్న విజయ్.. అవినీతిపై రాజీపడబోమనే సంకేతాన్ని వరుస చర్యల ద్వారా ఇస్తున్నారు. ప్రజల సహకారంతోనే అవినీతిని పూర్తిగా నిర్మూలించగలమని ఆయన పదేపదే చెబుతున్నారు. ఈ క్రమంలో.. మొన్న కరూర్లో ఇటీవల నిర్వహించిన ప్రజాసభలో మాట్లాడుతూ.. తన ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి ఏమాత్రం తావుండబోదని తేల్చిచెప్పారు.
"ఎవరైనా లంచం అడిగితే నేరుగా 'ఇవ్వను' అని చెప్పండి. మీ వెంటే నేను ఉంటాను. అయినా ఒత్తిడి చేస్తే.. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న విజయ్ మా వెన్నంటి ఉన్నారని ధైర్యంగా చెప్పండి" అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆ సందర్భంలో స్పష్టం చేశారాయన.
ఇక అవినీతి నిర్మూలన కోసం విజయ్ ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేసేందుకు 94981 80936 నంబర్తో ప్రత్యేక వాట్సాప్ హెల్ప్లైన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనితో పాటు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (DVAC) ఫిర్యాదు వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.
అంతేకాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బోర్డులు, కార్పొరేషన్లలో "లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరాలే" అనే హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే సందేశాన్ని అన్ని ప్రభుత్వ వెబ్సైట్లలోనూ ప్రదర్శించాలని, నేరుగా DVAC ఫిర్యాదు లింక్ను అందుబాటులో ఉంచాలని సూచించింది. ఈ చర్యల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ బృందాలను కూడా ఏర్పాటు చేసింది. తమిళనాడులో విజయ్ సర్కార్ చేపడుతున్న అవినీతి వ్యతిరేక చర్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.


