సీఎం విజయ్కు విద్యార్థిని వినూత్న విన్నపం
సాక్షి, చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల విజయం తర్వాత సీఎం విజయ్ తన సొంత నియోజకవర్గమైన పెరంబూర్లో తొలిసారి పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఎనిమిదో తరగతి చదువుతున్న రుద్ర అనే విద్యార్థిని సీఎంని కలిసి తన సమస్యను విన్నవించుకోవాలని భావించింది. అయితే, భద్రతా కారణాల వల్ల సీఎంను కలవలేక ఆ బాలిక నిరాశకు గురైంది.
దీనిపై మీడియా ప్రతినిధులు విద్యార్థిని ప్రశ్నించగా, ఆమె తన కోరికను మంగళవారం సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. “పాఠశాల పుస్తకాల బ్యాగు బరువు చాలా ఎక్కువగా ఉంటోంది. అంత బరువును రోజూ మోయడం వల్ల తీవ్రమైన నడుము నొప్పి వస్తోంది. విద్యార్థులపై ఉన్న ఈ పుస్తకాల సంచుల బరువును తగ్గించేలా సీఎం తగిన చర్యలు తీసుకోవాలి అని కోరింది. కాగా ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుండడం గమనార్హం.


