కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ బ్లెండింగ్ (ఇంధనంలో ఇథనాల్ మిశ్రమం) విధానంపై వస్తున్న ‘ఆసక్తుల ఘర్షణ’ (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) ఆరోపణలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు. ఈ విధానం వల్ల తన కుటుంబానికి వ్యక్తిగతంగా ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఇవన్నీ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని, తన ప్రతిష్టను, దేశ ప్రగతిని దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్ర అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ కొన్ని అంశాలు వెల్లడించారు.
వాస్తవాలు ఇవే.. నా వాటా నామమాత్రం!
కాంగ్రెస్ పార్టీ, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎటువంటి ఆధారాలు లేవని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఇథనాల్ విధానం ప్రవేశపెట్టడానికంటే ఎంతో ముందే తమ కుటుంబానికి షుగర్ వ్యాపారం ఉందని గుర్తుచేశారు. ‘దేశవ్యాప్తంగా దాదాపు 550 యూనిట్ల ద్వారా ఏటా 1,500 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో మా కుటుంబానికి, నా కుమారుల కంపెనీలకు ఉన్న వాటా కేవలం 0.07 శాతం మాత్రమే. ఇంత స్వల్ప భాగస్వామ్యం ఉన్న వ్యక్తి దేశవ్యాప్త విధానాన్ని తన స్వప్రయోజనాల కోసం ఎలా ప్రభావితం చేయగలరు?’ అని గడ్కరీ అన్నారు.
తన కుమారుల వ్యాపారంలో ఇథనాల్ అనేది కేవలం 10 శాతం మాత్రమేనని, ఆ సంస్థలపై ప్రస్తుతం రూ.1,600 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ కొనుగోళ్లు లేదా ధరల నిర్ణయ ప్రక్రియతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇది ఒక్కరి నిర్ణయం కాదు.. రైతుల కోసమే!
ఇంధన సంబంధిత నిర్ణయాలన్నీ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయని, తన మంత్రిత్వ శాఖ కేవలం వాహనాల ఇంజిన్ ప్రమాణాలను మాత్రమే పర్యవేక్షిస్తుందని గడ్కరీ వివరించారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం కేవలం ఒకరి నిర్ణయంతో కాకుండా కేంద్ర కేబినెట్, పెట్రోలియం మంత్రిత్వ శాఖ, శాస్త్రీయ సంస్థల విస్తృత సంప్రదింపుల తర్వాతే అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ విధానం వాజపేయ్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రారంభమైందని, ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం కూడా దీనిని సమర్థించిందని గుర్తు చేశారు.
రైతుల ఆదాయాన్ని పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడం, దేశానికి భారం అవుతున్న ముడి చమురు దిగుమతులను నియంత్రించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తాను కేవలం చెరకు నుంచే కాకుండా మొక్కజొన్న, వెదురు, వ్యవసాయ వ్యర్థాల నుంచి కూడా ఇథనాల్, మిథనాల్, హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.
ఇంజిన్లు దెబ్బతింటాయనేది తప్పుడు ప్రచారం
ఈ 20 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) వాడకం వల్ల వాహనాల మైలేజీ తగ్గిపోతుందని, ఇంజిన్లు పాడవుతాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని గడ్కరీ తేల్చిచెప్పారు. అమెరికా, బ్రెజిల్, జర్మనీ, స్వీడన్ వంటి దేశాల్లో దశాబ్దాలుగా దీన్ని విజయవంతంగా వాడుతున్నారని పేర్కొన్నారు. వాహనదారులెవరైనా దీనివల్ల నష్టపోతే నేరుగా కంపెనీలకు లేదా తనకు ఫిర్యాదు చేయవచ్చని సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: కోట్లు ఉన్నా కొరత భావనేనా?


