సాక్షి, హైదరాబాద్: ‘శాంతిభద్రతల పరిరక్షణ.. ప్రజల ప్రాణ, ఆస్తులకు రక్షణ’ ఇదీ పోలీసు శాఖ నినాదం. కానీ.. ఇటీవల గ్రేటర్లోని కొన్ని పోలీసు స్టేషన్లలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ నినాదం కాస్త ‘డబ్బులు ఇస్తేనే రక్షణ.. లేకుండా వేధింపుల శిక్షణ’ అన్నట్లుగా మారుతోంది. ఇటీవల షాబాద్ జరిగిన తంతు ప్రస్తుతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నగరంలోని పలు స్టేషన్లలో బాధితుల నుంచే పోలీసులు లంచాలు డిమాండ్ చేయడం, ఏకంగా ఠాణా ఆవరణలోనే చేతులు మారడం వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
చేయి తడిపితేనే..
ఎఫ్ఐఆర్ నమోదు నుంచి వేగవంతమైన దర్యాప్తు, చార్జ్షిట్ దాఖలు, స్టేషన్ బెయిల్ వరకూ ప్రతి దానికీ వసూళ్లే. భూ వివాదాలు, భార్యభార్తల గొడవలు, అద్దె ఇళ్ల వివాదాలను కొందరు పోలీసులు తమకు కాసుల కురిపించే కామధేనువులుగా మార్చుకుంటున్నారు.
బాధితుడు ఇచ్చే ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలన్నా వేలల్లో డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలన్నా లేదా కేసు తీవ్రతను తగ్గించాలన్నా రూ.లక్షల్లో డీల్ మాట్లాడుకుంటున్నారు. నేరుగా అధికారులు దొరికిపోకుండా ఉండేందుకు స్టేషన్లోని రైటర్లు, కానిస్టేబుళ్లను లేదా బయటి వ్యక్తులను మధ్యవర్తులుగా వాడుకుంటున్న ఉదంతాలెన్నో బయటపడుతున్నాయి.
రాజకీయ అండదండలతో..
షాబాద్ ఠాణాలో ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్కుమార్ నుంచి లంచం తీసుకొని స్టేషన్ బెయిల్ ఇచి్చన నేపథ్యంలో ఎస్ఐ, సీఐలను కమిషనర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గ్రేటర్లో ఈ తరహా స్టేషన్లు అనేకం. ఠాణా ఆవరణలోనే బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన అధికారులు చాలా మందే ఉన్నారు. హద్దు మీరుతున్న ఈ ఖాకీల వెనక ‘ఖద్దరు’ అండదండలు దండిగా ఉంటున్నాయి. ఎల్బీనగర్ జోన్లోని ఓ డివిజన్ అధికారికి నిజామాబాద్ మాజీ ఎంపీ అండదండలు దండిగా ఉండటంతో అతను ఆడిందే ఆటగా మారింది. పలు కేసులలో ‘హద్దు’ మీరి ప్రవర్తించారనే ఆరోపణలతో ఎస్బీ అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజమేనని గుర్తించి రాష్ట్ర పోలీసు బాస్కే రెండుసార్లు నివేదికలు అందజేసినా.. చర్యలు తీసుకోలేదంటే అతని రాజకీయ పలుకుబడిని అర్థం చేసుకోవచ్చు.
కొరవడిన నిఘా..
పోలీసు శాఖలోనే ఉండే ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విభాగాలు అవినీతి అధికారుల కదలికలపై నిఘా పెట్టడంలో విఫలమవుతున్నాయి. ఏసీబీ దాడుల చేసే వరకూ సొంత శాఖకు సమాచారం లేకపోవడమే దీనికి నిదర్శనం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతీ ఠాణాలో ఆడియోతో కూడిన సీసీటీవీ కెమెరాలు ఉండాలి. కానీ, గ్రేటర్లో పలు పీఎస్లలో రైటర్ గదులు, ఎస్ఐ గదుల్లోని కెమెరాలు తరచూ సాంకేతిక లోపాల సాకుతో పనిచేయకుండా పోతున్నాయి. లంచాల బేరాలు సాగేది ఇక్కడే.
ఉమెన్ పీఎస్లలో ‘హనీట్రాప్’
మహిళా పోలీసు స్టేషన్లలో 498ఎ కేసు అంటే కాసుల పండగే. భార్యభర్తల మధ్య గొడవలు, కుటుంబ కలహాలను ఆసరాగా చేసుకొని ఉమెన్ పీఎస్లో కొందరు సిబ్బంది హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు. కౌన్సెలింగ్ పేరుతో స్టేషన్కు వచ్చే భర్తలను కొందరు మహిళా కానిస్టేబుళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని, మాయమాటలతో బ్లాక్మెయిలింగ్లకు పాల్పడుతూ రూ.లక్షల్లో నగదు, ఖరీదైన బహుమతులను లాగేస్తున్నారని మల్కాజిగిరి ఎస్బీ అధికారి ఒకరు తెలిపారు. ఇక, సైబర్ క్రైమ్ స్టేషన్లలో ఆన్లైన్ మోసాలకు గురైన బాధితుల అకౌంట్లను ఫ్రీజ్ చేయడం, మళ్లీ వాటిని అన్ఫ్రీజ్ చేయడానికి కొందరు అధికారులు నిందితులతో చేతులు కలుపుతున్నారు. క్రిప్టో కరెన్సీ, సైబర్ మోసాల కేసుల్లో నిందితుల నుంచి రూ.లక్షలను క్రిప్టో రూపంలోనే లంచంగా తీసుకుంటున్న ఉదంతాలు అనేకం.


