ఒక వ్యక్తి ఎంత చదువుకున్నాడు అనే విషయం మాత్రమే.. అతని ఆర్థిక విజయాన్ని నిర్ణయించదని చెబుతారు రాబర్ట్ కియోసాకి. డబ్బును ఎలా అర్థం చేసుకుంటాడు, దాన్ని ఎలా ఉపయోగిస్తాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేదే అతని ఆర్థిక స్థితిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. చాలా మంది జీవితంలో ఒకే విధంగా కష్టపడుతున్నప్పటికీ, కొందరు సంపదను సృష్టిస్తారు, మరికొందరు డబ్బు సమస్యలతోనే కొనసాగుతారు. దీనికి ప్రధాన కారణం వారి ఆలోచనా విధానం.
చదువు మాత్రమే సంపదను ఇవ్వదు
కియోసాకి ఈ భావనను 'పూర్ డాడ్' - 'రిచ్ డాడ్' అనే రెండు భిన్నమైన ఆలోచనా విధానాలతో పోల్చారు.
పూర్ డాడ్ బాగా చదువుకున్న వ్యక్తి. ఆయనకు ఉన్నత విద్య ఉన్నప్పటికీ, డబ్బు విషయంలో సాధారణంగా చాలామంది ఆలోచించే విధంగానే ఆలోచిస్తారు. ఉద్యోగం, స్థిరమైన ఆదాయం, భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
మరోవైపు రిచ్ డాడ్ పెద్దగా చదువుకోకపోయినా.. డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్నారు. ఆయన ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించడం, ఆస్తులను పెంచుకోవడం వంటి విషయాలపై దృష్టి పెడతారు. అంటే దీని అర్థం చదువు అవసరం లేదని కాదు. విద్యతో పాటు ఆర్థిక అవగాహన కూడా చాలా ముఖ్యమని చెప్పడం.
పెట్టుబడుల విషయంలో.. ఆలోచనలో తేడా!
సాధారణంగా చాలామంది పెట్టుబడి పెట్టేటప్పుడు.. 'ఏ పెట్టుబడి సురక్షితమైనది?' అని అడుగుతారు. ఎందుకంటే నష్టం రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆర్థికంగా విజయవంతమైన వ్యక్తులు.. 'ఏ పెట్టుబడి నాకు ఆదాయం తెస్తుంది? దానిపై నాకు ఎంత నియంత్రణ ఉంటుంది? దాన్ని ఎలా పెంచుకోవచ్చు?' అని ఆలోచిస్తారు. అంటే ముఖ్యమైన విషయం కేవలం ఏ ఆస్తిలో పెట్టుబడి పెడుతున్నామన్నది కాదు. ఆ ఆస్తి గురించి మనకు ఎంత అవగాహన ఉందన్నదే అసలు విషయం.
సేఫ్టీ కోసం వెతకడం vs జ్ఞానం సంపాదించడం
పూర్ డాడ్.. 'ప్రమాదం వద్దు.. డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలి' అని అనుకుంటారు. కానీ రిచ్ డాడ్ ఆలోచన 'ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే ముందుగా ఆ విషయం గురించి నేర్చుకోవాలి'. పెట్టుబడుల్లో రిస్క్ సహజం. కానీ అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం మరింత ప్రమాదకరం. ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టే రంగం గురించి తెలుసుకుంటే, సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుంది. తద్వారా ధనవంతులు అవుతారు.


